ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక ఓ తండ్రి తన బిడ్డ శవాన్ని 10 కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకెళ్లాడు. ఈ హృదయవిదారక ఘటన చత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై ఈశ్వర్ నడిచివెళ్తుండగా కొందరు తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్గా మారడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దియో స్పందించి, విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. అమ్దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్కు సురేఖ(7) అనే కూతురు ఉంది. సురేఖ గత నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. దీంతో బాలికను లఖాన్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు శుక్రవారం తీసుకొచ్చారు. సురేఖను వైద్యులు పరీక్షించగా, ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోయినట్లు తేలింది. ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో.. శుక్రవారం ఉదయం 7:30 గంటలకు మృతి చెందిందని రూరల్ మెడికల్ అసిస్టెంట్ డాక్టర్ వినోద్ భార్గవ్ తెలిపారు. అయితే శవాలను తరలించే వాహనం అందుబాటులో లేకపోవడంతో, చేసేదేమీ లేక ఈశ్వర్ తన భుజాలపైనే బిడ్డ శవాన్ని 10 కిలోమీటర్ల మేర నడక సాగించి, స్వగ్రామానికి చేరుకున్నాడు.