Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బడ్జెట్‌ 2022-23 కీలకాంశాలు

వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022-23)కు సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా బడ్జెట్‌ ప్రసంగం సాగింది.
డిజిటల్‌ కరెన్సీ తీసుకొస్తాం
రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీని తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బ్లాక్‌చెయిన్‌ ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్‌ కరెన్సీని జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీన్ని 202-23 నుంచి ఆర్‌బీఐ జారీ చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుంది. 2022-23లో ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీని తీసుకువస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

2022లో 5జి స్పెక్ట్రమ్‌ వేలం
ప్రైవేట్‌ రంగం ద్వారా 5జి మొబైల్‌ సేవలను ప్రారంభించడానికి 2022లో స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. పిఎల్‌ఐ పథకం కింద, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సరసమైన ధరలకు బ్రాడ్‌బ్యాండ్‌, మొబైల్‌ కమ్యూనికేషన్‌ను నిర్ధారించడానికి 5జి పర్యావరణ వ్యవస్థను ప్రారంభించేందుకు డిజైన్‌ ఆధారిత తయారీ పథకం కూడా ప్రారంభించబడుతుంది.

కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక
పట్టణ ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం జరుగుతుందన్నారు. అదే విధంగా, సరుకు రవాణా కోసం మరిన్ని కేటాయింపులు చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంచుతామని పేర్కొన్నారు. భూరికార్డులను డిజిటలైజేషన్‌ చేస్తామని నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పీఎస్‌
కంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ (నేషనల్‌ పెన్షన్‌ స్కీం) డిడక్షన్‌ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పీఎస్‌ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడిరచారు.

రిటర్న్‌ల దాఖలులో మరో వెసులుబాటు
ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలులో మరో వెసులబాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చు. సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్‌ పన్ను ప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు ఉంటుంది.

ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఉపశమనం లేదు
సాధారణ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి సడలింపు ఇవ్వలేదు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి మార్పు చేయలేదని ఆర్థిక మంత్రి తెలిపారు. వర్చువల్‌ కరెన్సీ ద్వారా వచ్చే ఆదాయాలపై 30% పన్ను విధించబడుతుంది.

రక్షణ రంగంలో స్వావలంబన భారత్‌
రక్షణ రంగంలో స్వావలంబన భారత్‌ పథకాన్ని ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘రక్షణ రంగ ఉత్పత్తులను రూపొందించేందకు ప్రైవేటుకు ప్రోత్సహిస్తామిస్తాం. వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కొనేందుకు పథకం తీసుకొస్తాం. పంటల మదింపు, భూరికార్డుల డిజిటిలీకరణ, పురుగు మందుల వినియోగంలో డ్రోన్ల సహకారం’ తీసుకొస్తామని చెప్పారు. సాగురంగంలో యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. వరి,గోధుమ కొనుగోళ్లు మద్దతు ధరల కోసం రూ.2.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గంగా పరివాహ వెంబడి నేచురల్‌ పార్మింగ్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, చిన్నారుల అభివృద్ధికి మూడు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు.

ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ పథకం వచ్చే ఏడాది వరకు..
ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌ని మార్చి 2023 వరకు పొడిగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గ్యారెంటీ కవర్‌ను రూ.50,000 కోట్ల నుంచి మొత్తం రూ.5 లక్షల కోట్లకు పెంచనున్నారు.

డిజిటల్‌ హెల్త్‌ ఎకోసిస్టమ్‌ కోసం ఓపెన్‌ ప్లాట్‌ఫారమ్‌
నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ ఎకోసిస్టమ్‌ కోసం ఓపెన్‌ ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని ద్వారా, ఆరోగ్య ప్రదాతలకు డిజిటల్‌ రిజిస్ట్రీలు, ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపులు మరియు ఆరోగ్య సౌకర్యాలకు సార్వత్రిక ప్రాప్యత సాధించబడుతుంది.

ఈ-పాస్‌పోర్ట్‌ జారీ చేస్తాం
త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక ఆభివృద్ధి పథకం తీసుకొస్తాం. దేశంలో నాలుగు చోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటుచేస్తాం. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలస్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తాం’ అని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన నాల్గవ బడ్జెట్‌ ప్రసంగంలో, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 1486 పనికిరాని చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు.

1.5 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థ
2022లో 1.5 లక్షల పోస్టాఫీసుల్లో కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ 100 శాతం ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వైబ్రంట్‌ విలేజెస్‌ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను ప్రారంభించనుంది. ప్రభుత్వం కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలనకు కట్టుబడి ఉంది.

75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్రారంభిస్తాం
ఇటీవలి కాలంలో డిజిటల్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపుల ట్రెండ్‌ పెరిగిపోయిందని మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తూ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను ప్రారంభించనున్నాం. ఇవన్నీ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి మరియు సామాన్య ప్రజలు దీని నుండి ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 80 లక్షల కొత్త ఇళ్లు
2022-23లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 80 లక్షల కొత్త ఇళ్లను నిర్మిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. వాటి కోసం రూ.48 వేల కోట్ల నిధిని ఉంచారు.

పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు..
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముందంజలో ఉన్నామని నిర్మల వెల్లడిరచారు. ఎయిరిండియా బదిలీని పూర్తి చేసినట్లుగా సభకు తెలిపారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామని ప్రకటించారు. ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు..
ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌ను తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ పథకం ఉంటుందన్నారు. క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

స్కూలు విద్యార్థుల కోసం ‘వన్‌ క్లాస్‌వన్‌ టీవీ ఛానల్‌’..

ఈ బడ్జెట్‌లో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థులందరికీ ఈకంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు టీవీల ద్వారా అనుబంధ విద్యను అందించనున్నట్లు తెలిపారు. ప్రధాని ఈ`విద్య కార్యక్రమం ద్వారా అనుబంధ విద్యా విధానాన్ని మరింత విస్తరించునున్నట్లు తెలిపారు. ప్రస్తుతం . 1 నుండి 12 తరగతుల వరకు 12 టెలివిజన్‌ ఛానళ్లు ఉండగా వీటిని 200 ఛానళ్ళకు పెంచుతున్నామని తెలిపారు. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్‌ ఏర్పాటు చేయడంతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ టీవీల్లో తరగతులు బోధన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌, మొబైల్‌ఫోన్‌, టీవీ, రేడియోల ద్వారా తరగతుల బోధన ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులకు డిజిటల్‌ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.


ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్శిటీ
విద్యార్థులకు ఐఎస్‌టీఈ ప్రమాణాలతో ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం ఉన్న టాప్‌ యూనివర్శిటీల సహకారంతో ఈ డిజిటల్‌ వర్శిటీల కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం..
పర్వతమాల ప్రాజెక్టు కింద కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు కల్పించనున్నట్లుగా తెలిపారు. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధిదేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడిరచారు. మల్టీమోడల్‌ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేయడం. వచ్చే మూడేళ్లలో వంద కార్గో టెర్మినళ్ల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.


చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం
2023ను తృణధాన్యాల సంవత్సరంగా..
చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడిరచారు. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేస్తామన్నారు. రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.

వ్యవసాయ వర్శిటీల్లో సిలబస్‌ మార్పులు
వ్యవసాయ వర్శిటీల్లో సిలబస్‌ మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. జీరో బడ్జెట్‌ సాగు, సేంద్రీయ సాగు, అధునాతన వ్యవసాయం, వాల్యూ అడిషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలను కొత్తగా చేర్చనున్నట్లు వెల్లడిరచారు. సిలబస్‌ మార్పుల కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించనున్నట్లు తెలిపారు.

400 వందే భారత్‌ రైళ్లు
రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పీఎం గతిశక్తి పథకంలో సంతులిత అభివృద్ధి సాధించామన్నారు. మేకిన్‌ ఇండియా పథకంలో 6 మిలియన్ల ఉద్యోగాలు, 400 వందే భారత్‌ రైళ్లు, 100 గతిశక్తి టెర్మినల్స్‌, జాతీయ రహదారులు మరో 25 వేల కి.మీ. విస్తరణ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img