76 శాతం విరాళాలు బీజేపీవే – కాంగ్రెస్కు 9 శాతమే
న్యూదిల్లీ : 2019-20 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో మూడొంతులు లేదా 76శాతంఒక్క భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే పొందింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 9శాతం మాత్రమే పొందింది. ఎన్నికల కమిషన్ డేటా ఈ మేరకు నివేదించింది. 2019-20లో మొత్తంగా రూ. 3,355 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడయ్యాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఎలక్టోరల్ బాండ్ అనేది ఒక ఆర్థిక ఉపకరణం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏదైనా శాఖల నుంచి భారతీయ పౌరుడు లేదా భారత్లో విలీనం అయిన ఏదైనా సంస్థ కొనుగోలు చేయగల ప్రామిసరీ నోట్ లాంటిది. వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు తమకు నచ్చిన ఏదైనా అర్హత ఉన్న రాజకీయపార్టీకి విరాళం అందించవచ్చు. రూ. 3,355 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల (2019-20)లో బీజేపీకి రూ. 2,555 కోట్లు వచ్చాయి. ఇది గత సంవత్సరం అందుకున్న (రూ .1,450 కోట్లు) విరాళాలతో పోలిస్తే 75% ఎక్కువ. కాంగ్రెస్ 2019-20లో రూ. 318 కోట్లు అందుకుంది. ఇది గత ఏడాది అందుకున్న రూ .383 కోట్ల కంటే 17% తక్కువ. ఇక మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ .100.46 కోట్లు, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రూ .29.25 కోట్లు, శివసేన రూ .41 కోట్లు, డీఎంకే రూ .45 కోట్లు, లాలూప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ రూ.2.5 కోట్లు, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ రూ .18 కోట్లు విరాళాలు పొందాయి. 2019-20లో ఎన్నికలు, సాధారణ ప్రచారానికి బీజేపీ రూ .1,352.92 కోట్లు వ్యయం చేసింది. 2019 లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ప్రకటనల కోసం రూ .400 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
ప్రారంభం నుంచి 2020 మార్చి వరకు విక్రయించిన 68% ఎలక్టోరల్ బాండ్లను విరాళాల రూపంలో బీజేపీ మాత్రమే స్వీకరించింది. బాండ్లు రాకముందునుంచే బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉందని ఇది పేర్కొంది. జనవరి మొదట్లో ఉన్న స్థితితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం దాదాపు 16 రెట్లు పెరిగింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎస్బీఐ ఈ సంగతి వెల్లడిరచింది. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో 10 రోజుల పాటు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మాసాల్లో మొదటి 10 రోజులు ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు కోసం ప్రభుత్వం నిర్దేశించింది. లోక్ సభ ఎన్నికల సంవత్సరంలో వ్యవధి 30 రోజులకు పొడిగిస్తారు. ఊరూపేరు లేని ఈ ఎన్నికల బాండ్ల వ్యవహారంపై సామాజిక కార్యకర్తలు, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు పదేపదే ఆందోళనలు వెలిబుచ్చాయి. ‘‘అవినీతిని చట్టబద్ధం చేశారు’’ అని విమర్శించాయి. అయితే మోదీ ప్రభుత్వం మాత్రం ఈ బాండ్లు ‘‘రాజకీయాలలో నిజాయితీగా డబ్బు సంపాదించడానికి విజయవంతమైన ప్రయత్నం’’ అని వాదించింది. లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరుగుతాయి కనుక పారదర్శకతను మెరుగుపరుస్తాయి. ప్రతి రాజకీయ పార్టీ వారు ఎంత డబ్బు అందుకున్నారో వెల్లడిరచాలని పేర్కొంది.