ఆడియో టేపు బయట పెట్టిన డిప్యూటీ సీఎం సిసోడియా
న్యూదిల్లీ : దిల్లీలో మొత్తం 43 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీలోని కీలక వ్యక్తులు సంప్రదింపులు జరుపుతున్నారని ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. తెలంగాణలోనే కాకుండా దేశరాజధాని దిల్లీలోనూ డబ్బు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కమలం దళం యత్నిస్తోందని దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తన వాదనకు బలం చేకూర్చే విధంగా ఆడియో టేపును వినిపించారు.
దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధం ఉన్నట్లు తేలితే ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీ, పంజాబ్లోని ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకూ బీజేపీ యత్నించిందనేందుకు ఈ ఆడియోనే సాక్ష్యమన్నారు. దీనిపై ఈడీతో విచారణ జరపాలని సిసోడియా డిమాండు చేశారు. హోంమంత్రి స్థానంలో ఉన్న అమిత్ షా వంటి వ్యక్తి ఇలాంటి కుట్రలో భాగస్వాములు కావడం దేశానికే ప్రమాదకరమన్నారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పావులు కదిపి బీజేపీ దొరికిపోయిందని సిసోడియా విమర్శించారు.