Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

500 మంది సిబ్బంది.. 104 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌.. బోరుబావి నుంచి క్షేమంగా బాలుడు

బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయి నాలుగు రోజులు తర్వాత 11 ఏళ్ల బాలుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. చత్తీస్‌గఢ్‌కు చెందిన దివ్యాంగ బాలుడు రాహుల్‌ సాహు గత శుక్రవారం తన ఇంటి వద్ద ఆటాడుకుంటూ అక్కడే ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఆ బాలుడుని 104 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌ తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు తీశారు. ప్రస్తుతం రాహుల్‌ పరిస్థితి నిలకడగానే ఉంది. జంజ్‌గిర్‌ జిల్లా మల్‌ఖోర్దా బ్లాక్‌లోని పిహ్రిద్‌ గ్రామానికి చెందిన రాహుల్‌ సాహూ.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తన ఇంటి వెనుక ఆడుకుంటూ అక్కడ ఉన్న 80 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాయి.
బాలుడి బోరుబావిలో పడిపోయిన విషయం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. అక్కడకు చేరుకుని హుటాహుటీన సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, పోలీసులు, స్థానిక అధికారుల సహా 500 మందికిపైగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. బాలుడు 60 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్టు గుర్తించి దానికి సమాంతరంగా గుంతను తవ్వారు. సుదీర్ఘంగా 104 గంటలు పాటు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. చివరకు బాలుడు ప్రాణాలతో బయటపడటం విశేషం. రాహుల్‌ సాహు స్పృహలోనే ఉండటంతో పైపుల ద్వారా ఆహారాన్ని బాలుడి వద్దకు పంపించారు. ఆక్సిజన్‌ కోసం మరో పైపును ఏర్పాటు చేశారు. అయితే, బోరుబావిలో పడిపోయిన చిన్నారులకు సంబంధించి దేశంలో ఇదే సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్‌. 2006లో హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన బాలుడు బోరుబావిలో పడిపోగా.. 50 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత బయటకు తీశారు. ఇక, సాహూ రెస్క్యూ ఆపరేషన్‌ను శుక్రవారం నుంచి పర్యవేక్షిస్తున్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘అందరి ప్రార్థనలు, రెస్క్యూ టీమ్‌ అవిశ్రాంత అంకితభావ ప్రయత్నాలతో రాహుల్‌ సాహు క్షేమంగా బయటపడ్డాడు. బాలుడు వీలైనంత త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటాడని అధికారులు తెలిపారు. బాలుడ్ని మెరుగైన వైద్యం కోసం బిలాస్‌పూర్‌లో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలి నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న బిలాస్‌పూర్‌కు వేగంగా బాలుడ్ని తరలించడానికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటుచేసినట్టు బిలాస్‌పూర్‌ కలెక్టర్‌ జితేందర్‌ శుక్లా తెలిపారు. అత్యాధునిక పరికరాలు, వాహనాలతో సహాయక చర్యలు కొనసాగగా.. సీఎం బాఘేల్‌ ఆదేశాలతో పది మందికిపైగా మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఘటనాస్థలంలోనే మకాం వేసి పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img