Friday, April 19, 2024
Friday, April 19, 2024

6.8 శాతం వృద్ధి

. ఆర్థిక సర్వే వెల్లడి
. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూదిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి 6.8 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) 6.1 శాతం అంచనా కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని అంచనా. ఆర్థిక పరిస్థితిని వివరించే సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడానికి ఒకరోజు మంగళవారం ముందు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత సీతారామన్‌ ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంటులో దివంగత ఎంపీలు, మాజీ సభ్యులకు నివాళులర్పించారు. కాగా ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గత ఏడాది అనేక రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధిక చేపట్టవలసిన సంస్కరణలను పేర్కొన్నారు. 2020 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కనీసం మూడు షాక్‌లు తగిలాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ రూపొందించిన నివేదిక పేర్కొంది. ప్రపంచ ఉత్పత్తి మహమ్మారి-ప్రేరిత సంకోచంతో ప్రారంభించి, గత సంవత్సరం రష్యన్‌-ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసిందని వివరిస్తూ, ఆపై, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నేతృత్వంలోని ఆర్థిక వ్యవస్థల్లోని కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి సమకాలీకరించబడిన పాలసీ రేటు పెంపుతో ప్రతిస్పందించాయని సర్వే పేర్కొంది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ, మహమ్మారిని ఎదుర్కొన్న తర్వాత, అనేక దేశాల కంటే 202223 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్‌ 2021 నుంచి మార్చి 2022 వరకు) పూర్తి పునరుద్ధరణను పొందడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మహమ్మారి ముందు వృద్ధి పథంలోకి దూసుకెళ్లేందుకు తనను తాను నిలబెట్టుకున్నట్లు కనిపిస్తోందని వివరించింది. అయితే ప్రస్తుత సంవత్సరంలో, యూరోపియన్‌ కలహాలు పెంచిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే సవాలును కూడా భారతదేశం ఎదుర్కొందని సర్వే పేర్కొంది. ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడం వల్ల భారత రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలహీనత కారణంగా ఎగుమతులు తేలికగా, బలమైన స్థానిక ఆర్థిక వ్యవస్థ కారణంగా దిగుమతులు ఎక్కువగా ఉండగలవని, అందువల్ల కూడా ఎదుగుదల ఉండవచ్చని తెలిపింది. పెరుగుతున్న నిత్యావసర ధరలు, బలహీనమైన రూపాయి వాణిజ్య అంతరాన్ని పెంచడంతో భారతదేశ సీఏడీ జులై-సెప్టెంబరు కాలంలో జీడీపీలో 4.4 శాతంగా ఉందని, ఇది ఒక త్రైమాసికం క్రితం 2.2 శాతం, ఒక సంవత్సరం క్రితం 1.3 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. బలమైన వినియోగం కారణంగా దేశంలో ఉపాధి పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, అయితే మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రైవేట్‌ పెట్టుబడులను పెంచుకోవడం తప్పనిసరి అని సర్వే పేర్కొంది. ‘ప్రపంచ వృద్ధి మందగించడం, వాణిజ్యం ప్రస్తుత సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రపంచ మార్కెట్‌ పరిమాణాన్ని కుదించడంతో ఎగుమతి ఉద్దీపన కోల్పోవడం మరింత సాధ్యమవుతుంది’ అని తెలిపింది. ద్రవ్యోల్బణం చాలా ఆందోళనకరంగా ఉండకపోగా, స్థిరపడిన ద్రవ్యోల్బణం బిగించే చక్రాన్ని పొడిగించవచ్చని, అందువల్ల రుణ ఖర్చులు ‘ఎక్కువ కాలం ఎక్కువ’ ఉండే అవకాశం ఉందని సూచించింది. మహమ్మారి నుంచి భారతదేశం కోలుకోవడం సాపేక్షంగా త్వరితంగా ఉంది, స్థిరమైన దేశీయ డిమాండ్‌, మూలధన పెట్టుబడిలో పెంపు ద్వారా వృద్ధికి మద్దతు ఉంటుందని సర్వే వివరించింది. కార్పొరేట్‌, బ్యాంకింగ్‌ రంగాల బ్యాలెన్స్‌ షీట్‌లను బలోపేతం చేయడంతో భారతదేశంలో బలమైన రుణ పంపిణీ, మూలధన పెట్టుబడి చక్రం ఆవిష్కృతమవుతుందని అంచనా వేస్తున్నందున 202324లో వృద్ధి చురుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. పబ్లిక్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ, ఉత్పాదక ఉత్పత్తిని పెంచడానికి పీఎం గతిశక్తి, జాతీయ రవాణా విధానం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాలు వంటి చర్యల నుంచి ఆర్థిక వృద్ధికి మరింత మద్దతు లభిస్తుందని పేర్కొంది. ‘ఆర్థిక వ్యవస్థ కోల్పోయిన వాటిని దాదాపుగా తిరిగి పొందిందని, మహమ్మారి సమయంలో, ఐరోపాలో సంఘర్షణ నుంచి మందగించిన వాటిని తిరిగి శక్తివంతం చేసింది’ అని ఇది తెలిపింది. 2023-24కి నామమాత్రపు వృద్ధిని 11 శాతంగా అంచనా వేస్తూ, ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చాలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే పటిష్టంగా ఉంటుందని సర్వే పేర్కొంది, ఇది నిరంతర ప్రైవేట్‌ వినియోగం, బ్యాంకుల ద్వారా రుణాలు, కార్పొరేషన్ల ద్వారా ఖర్చు చేయడం, మెరుగైన మూలధనాన్ని పుంజుకుంటుందని వివరించింది. నిర్మాణ స్థలాల్లో పని చేయడానికి వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం కూడా ఆశాజనక వృద్ధి అంచనాకు కారణమని పేర్కొంది. అలాగే కార్పొరేట్ల బ్యాలెన్స్‌ షీట్లను బలోపేతం చేయడం, మంచి మూలధనం కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణ సరఫరాను పెంచడానికి సిద్ధంగా ఉండటం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి రుణ వృద్ధి కూడా సహాయపడిరదని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img