ప్రధాని, రైల్వేమంత్రికి సీపీఐ సూచన
న్యూదిల్లీ: త్రివర్ణ పతాకాల విక్రయాల ద్వారా సొమ్ము చేసుకోవడాన్ని పాలక పక్షం ఆపేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. టోకు మార్కెట్లో రూ.10కి దొరికే జెండాను సామాజిక, ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.20కు, ప్రభుత్వ పోస్టాఫీసుల్లో రూ.25 చొప్పున అమ్ముతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ వ్యాఖ్యానించారు. ఈ వాస్తవాల దృష్ట్యా జాతీయ జెండా నీడలో జరుగుతున్న కుంభకోణంపై దృష్టి పెట్టాలని ప్రధానికి, రైల్వే మంత్రికి సూచించారు. త్రివర్ణ పతకాల దందా హేయమైన నేరమన్నారు. ఓ వైపు స్థానిక వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, దేశీయ ఉత్పత్తులను వినియోగించాలని ప్రధాని పిలుపునిస్తున్నారు మరోవైపు కోట్లలో త్రివర్ణపతాకాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని అన్నారు. ఈ పంద్రాగస్టున దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతాయి. ఇదే రోజు ప్రతి ఇల్లు, దుకాణం, విద్యా సంస్థలు, ప్రభుత్వ భవనాలు, ఆఫీసులపై మువ్వన్నెల జెండా రెపరెపలాడటం ఆనవాయితీ. తమ శాఖ నుంచి త్రివర్ణ జెండాలను కొనుగోలు చేయాలని పదిన్నర లక్షల మంది ఉద్యోగులకు భారతీయ రైల్వే ఇటీవల హకుం జారీ చేసింది. ఇందుకోసం వారి వేతనాల్లో నుంచి రూ.38 మినహాయిస్తుంది. అన్ని జెండాలను సరఫరా చేసేది ఒకరే కావడం గమనార్హమని ఆ ప్రకటనలో అంజన్ పేర్కొన్నారు.
‘కామన్వ్ల్త్’ విజేతలకు సీపీఐ అభినందనలు
కామన్వ్ల్త్ క్రీడలలో భారతీయ క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీ యమని సీపీఐ పేర్కొంది. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను భారతీయ క్రీడాకారులు సాధించడానికి వారి గట్టి పట్టుదల, కృషితో పాటు కోచ్ల మార్గదర్శకత్వమే కారణం అని అతుల్ కుమార్ అంజన్ అన్నారు. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. కోచ్లతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) దశాబ్దం పాటు తోడ్పాటు అందించిందని కొనియాడారు. యువ క్రీడాకారులకు ప్రోత్సాహం, తగిన శిక్షణ అందించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ విజయ పరంపరను ప్రతి కామన్వ్ల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు కొనసాగిస్తారని, ఒలింపిక్స్లోనూ వీరు మరింతగా రాణిస్తారని, మరిన్ని పతకాలు సాధిస్తారని అతుల్ కుమార్ ఆకాంక్షించారు.