ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. గన్నవరం ఎయిర్పోర్టుతో పాటు నెల్లూరు రైల్వే స్టేషన్లో బాంబులు పెట్టినట్లు కాల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్కు వెంటనే సమాచారం ఇచ్చారు. ప్రయాణికులను బయటకు పంపించి విమానాశ్రయం, రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీలు చేపట్టారు. పార్సిల్ కేంద్రం, బ్యాగులను చెక్ చేశారు. ఎక్కడా బాంబులు దొరకలేదు. దీంతో బాంబ్ బెదిరింపు కాల్స్ ఆకతాయిల పనిగా పోలీసులు గుర్తంచారు.
ఇక గన్నవరం ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్పై కేసు నమోదు చేశారు. తణుకు ప్రాంతం నుంచి ఆకతాయి కాల్ చేసినట్లు గుర్తించారు. ముప్పాళ్ల రంగ రామన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడే ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ పలువురు వీఐపీలకు కాల్ చేసి రంగరామన్ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.
వారం రోజుల క్రితం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చాడు. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ భద్రత తనిఖీలు చేపట్టారు. చివరికి బాంబ లేదని నిర్ధారించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.