. కొత్త రూపురేఖలకు ప్రణాళిక
. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోవాలి
. డైట్ చార్జీల పెంపువిద్యార్థులకు నాణ్యమైన ఆహారం బ ఏడాదిలోగా నాడు
నేడు కింద అభివృద్ధి పనులు
. వచ్చే ఏడాది అద్దె భవనాల స్థానంలో శాశ్వత భవనాలు
. సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, వాటికి కొత్త రూపు తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు
నేడు పై క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ సమీక్షించారు. ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు`నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు తేవాలని, పాఠశాల నిర్వహణ నిధి తరహాలోనే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం కిందకు హాస్టళ్లు, గురుకులాలను తీసుకురావాలని అన్నారు. వాటి నిర్వహణ ఖర్చులు, డైట్ చార్జీలను పెంచాలని, మన పిల్లలు హాస్టళ్లలో ఉంటే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో, అదే స్థాయిలో నిర్వహణ ఉండాలని, అందుకు తగిన సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఎలా ఉన్నాయన్నదానిపై స్వయంగా తానే తనిఖీలు చేయించానని, మనం చేయాల్సింది చాలా ఉందని, దీనిపై ఒక కార్యాచరణ తేవాలని అన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడునేడు కింద తొలిదశలో స్కూళ్లను అభివృద్ధి చేశామని, మొదటి దశలో చేసిన పాఠశాలలకు అదనపు తరగతి గదులు నిర్మించే పనికూడా జరుగుతోందన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని చెప్పారు. దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి పనుల్లో అధికారుల ముద్ర స్పష్టంగా కనిపించాలని చెప్పారు. అభివృద్ధి పనులు చేశాక, వాటి నిర్వహణ కూడా బాగా చేసేలా దృష్టిపెట్టాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధి, నిర్వహణ కోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచాలని ఆదేశించారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించాలన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయాలని సూచించారు. హాస్టళ్ల నిర్వహణ నిధి ఏర్పాటు చేయాలి సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ నిధి ఏర్పాటు చేయాలని, ప్రతి హాస్టల్లోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. హాస్టళ్లలో కుక్, వాచ్మెన్ వంటి ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టుగా చర్యలు తీసుకోవా లన్నారు. కుటుంబ వైద్యుడు తరహాగా, ఒక వైద్యుడు తప్పనిసరిగా సంక్షేమ హాస్టళ్ల బాగోగులపై దృష్టి సారించాలని చెప్పారు. డైట్ చార్జీలను పెంచి, విద్యా ర్థులకు మంచి ఆహారం అందించేలా చూడాలని, సమూలంగా డైట్ చార్జీలు పరిశీలించి, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ చార్జీలను పెంచిందన్నారు. అద్దె ప్రాతిపదికన ఉన్న వసతి గృహాలను వెంటనే పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించా రు. అలాంటి చోట్ల నాడు
నేడు కింద వచ్చే ఏడాది శాశ్వత భవనాలను నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రతి పనిలోనూ నాణ్యత తప్పనిసరిగా ఉండాలని, వాటికి అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి.జయలక్ష్మీ, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.జాహ్నవి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.