. నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
. చర్చలకు ఉద్యోగ సంఘాలు దూరం
. పాత పెన్షన్ విధానంపై పట్టు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీస్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) ప్రతిపాదనలపై చర్చలకు సంబంధించి జగన్ సర్కారుకు కలిసిరావడం లేదు. ప్రతిసారి జీపీఎస్పై చర్చలు చేపట్టినప్పటికీ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జీపీఎస్ వద్దని, పాత పెన్షన్ విధానమే తీసుకురావాలంటూ ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా మొండివైఖరితో జీపీఎస్ అమలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో మరోసారి ఉద్యోగ సంఘాలతో ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఉన్నది. మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు రావాలని జాయింట్ స్టాఫ్ కౌన్సెల్లోని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అటు ఉపాధ్యాయ సంఘాలూ ఈ సమావేశాన్ని బహిష్కరించనున్నాయి. ఆయా సంఘాలు మీడియా ముందుకు వచ్చి తగిన కారణాలు వెల్లడిరచనున్నాయి. ఉద్యోగులంతా పాత పెన్షన్ విధానాన్ని కోరితే… ప్రభుత్వ మాత్రం జీపీఎస్ను తెరపైకి తెచ్చి గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఈ సమావేశ నిర్వహణపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ నాయకులు కె.రాజేశ్, ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ నాయకులు ఎస్.ప్రసాద్ తదితర సంఘాల నేతలు జీపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జీపీఎస్ అంటేనే ఉద్యోగులకు నమ్మక ద్రోహమని తెలిపారు. 3.5 లక్షల మంది సీసీఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటే…అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీపీఎస్ తెరపైకి తేవడంపై సర్వత్రా వ్యతిరేకత నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం జీపీఎస్ ప్రతిపాదనలను విరమించి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.