ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 1000 మందికిపైనే గాయాలపాలయ్యారు. ఘటన జరిగి వారం రోజులైనా ప్రమాద దృశ్యాలు ఇంకా ప్రజల కళ్ల ముందే మెదలాడుతున్నాయి. ఇక ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్బాడీస్ ని బహానగ ప్రభుత్వ పాఠశాలలో భద్రపరిచిన విషయం తెలిసిందే.ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బహానగ పాఠశాలకు తరలించారు. అక్కడ నుంచి భువనేశ్వర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల తరలింపు తర్వాత పాఠశాలను శుభ్రపరిచారు. అయితే, అన్ని మృతదేహాలు ఒకే చోట చూడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో విద్యార్థులను ఆ పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. విద్యార్థులు సైతం స్కూల్కు వెళ్లేందుకు భయపడిపోతున్నారు.
దీంతో పాఠశాలను కూల్చివేయాలని స్కూల్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే పరిశీలించిన అధికారులు పాఠశాలను కూల్చివేశారు. 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల దెబ్బతిందని.. దీనికి తోడు తాజా పరిస్థితుల నేపథ్యంలోనే ఈ పాఠశాలను కూల్చివేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్ తెలిపారు.