అధ్యక్షురాలికి రాసిన లేఖలో మండిపడ్డ గులాం నబీ ఆజాద్
ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గులాంనబీ ఆజాద్..చివరికి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అందుకు గల కారణాలను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలికి లేఖ రాసిన ఆయన..తాను పార్టీని వీడడానికి రాహుల్గాంధీ తీరు ఓ కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ అపరిపక్వత ఆ పార్టీని నాశనం చేసినట్లు ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవస్థను రాహులే ధ్వంసం చేసినట్లు విమర్శించారు. దురదృష్టవశాత్తు రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు. 2013లో రాహుల్ను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియమించారని, కానీ సంప్రదింపుల వ్యవస్థను రాహుల్ నాశనం చేసినట్లు ఆరోపించారు. రాహుల్లో పరిపక్వత లేదనడానికి మరో సంఘటనను ఉదాహరణగా చెప్పారు ఆజాద్. ఓ సారి ప్రభుత్వ ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ మీడియా ముందే బహిరంగంగా చింపివేసినట్లు వెల్లడిరచారు. చిన్నపిల్లాడి మనస్తత్వంతో వ్యవస్థను చిన్నాభిన్నం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వ అధికారాల్ని చిన్నచూపు చూసినట్లు విమర్శించారు. 2014లో యూపీఏ ప్రభుత్వం ఓటమి చెందడానికి అది ప్రధాన కారణమైనట్లు ఆజాద్ ఆరోపించారు. 2014 నుంచి రెండు సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడినట్లు ఆజాద్ అన్నారు. చాలా అవమానకర రీతిలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. 2014 నుంచి 2022 వరకు జరిగిన 49 అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎన్నికల్లో ఓడిపోయినట్లు ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు నెగ్గిందని, ఓ ఆరు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్లు ఆజాద్ తన లేఖలో చెప్పారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఏలుతోందని, మరో రెండు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి హుటాహుటిన రాజీనామా చేశారని, పార్టీలోని సీనియర్ నేతల్ని అవమానించారని ఆజాద్ తెలిపారు. సోనియాజీ మీరు తాత్కాలిక అధ్యక్షురాలిగా మూడేళ్లుగా కొనసాగుతున్నారని, యూపీఏ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసిన రిమోట్ కంట్రోల్ విధానమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బతీస్తోందన్నారు. మీరు పార్టీ నేతగా ఉన్నా.. అన్ని కీలక నిర్ణయాలు మాత్రం రాహుల్ గాంధీ లేదా ఆయన సెక్యూర్టీ గార్డులు లేదా పీఏలు తీసుకుంటున్నట్లు ఆజాద్ విమర్శించారు.