Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

డిజిటల్‌ వార్తలకు కళ్లెం

కొత్త చట్టంపై కేంద్రం కసరత్తు

న్యూదిల్లీ: భారత్‌లో మొట్టమొదటిసారి ‘డిజిటల్‌ న్యూస్‌’పై మోదీ సర్కారు ఉక్కుపాదం మోపనుంది. డిజిటల్‌ వార్తలను నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. డిజిటల్‌ న్యూస్‌ సైట్లు సహా సంబంధిత డిజిటల్‌ మీడియా ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా అవి నడుచుకోవాలి. అతిక్రమణకు పాల్పడితే వెబ్‌సైటు రిజిస్ట్రేషన్‌ రద్దు లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ అండ్‌ పిరియాడికల్స్‌ చట్ట సవరణ ప్రక్రియను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మొదలుపెట్టింది. డిజిటల్‌ న్యూస్‌ సంస్థలను పర్యవేక్షించే ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. 90 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. సంబంధిత బిల్లు ఆమోదం పొందితే ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా నిర్వహించే అన్ని రకాల డిజిటల్‌ మీడియా న్యూస్‌ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌గా ఒక అప్పిలేట్‌ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. డిజిటల్‌ మీడియా న్యూస్‌పై భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదు. ప్రతిపాదిత చట్టం ఆచరణలోకి వస్తే డిజిటల్‌ మీడియాని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నియంత్రిస్తుంది. ఈ బిల్లుకి ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు ఇతర భాగస్వాముల ఆమోదం లభించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img