
. ప్రధాని పార్లమెంటులో మాట్లాడాలి
. భిన్న సంస్కృతులున్న దేశంలో ఒకే చట్టం సాధ్యం కాదు
. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
విశాలాంధ్ర – విజయవాడ : బీజేపీ దుర్మార్గాలకు బలవుతున్న మణిపూర్ ప్రజలకు భారతదేశం మొత్తం అండగా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య వైరం, మత విద్వేషాలతో అట్టుడుకుతున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాలపై పార్లమెంటులో మాట్లాడాలని డిమాండ్ చేశారు. మణిపూర్ మారణకాండను నిరసిస్తూ, గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించటాన్ని ఖండిస్తూ, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరుతూ సీపీఐ విజయవాడ నగర సమితి అధ్వర్యంలో నిర్వహించిన సంఫీుభావ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక దాసరి భవన్లో బుధవారం సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీపై ‘ఇండియా’ కూటమి అవిశ్వాస తీర్మానం పెడుతుందని, దీనికి కూటమిలోని 26 రాజకీయ పార్టీలతో పాటు ఇతర పార్టీల మద్దతు ఉందన్నారు. అవిశ్వాస తీర్మానం వల్ల అన్ని రాజకీయ పార్టీలకు మాట్లాడే అవకాశం వస్తుందని, చివరిలో ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతులు, సంస్కృతులు పేరుతో సమస్యలు వచ్చాయని తెలిపారు. దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్ తదితర ప్రాంతాల సంస్కృతులు వేరువేరుగా ఉంటాయన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి అందరి మనోభావాలు గౌరవించబడేలా రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. ఖలిస్తాన్, జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు వచ్చినప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని, అందరూ కలిసి ఉండాలని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఖలిస్తాన్ ఉద్యమం సందర్భంలో 60 మంది కమ్యూనిస్టు వీరులను పార్టీ కోల్పోయిందన్నారు. అందరూ కలిసి ఉంటేనే బలమైన భారతదేశం ఏర్పడుతుందన్నారు.
ప్రాంతాల మధ్య ఆందోళనలు రాజకీయ ఉద్యమాలుగా మార్పు
నేడు ప్రాంతాల మధ్య ఆందోళనలు రాజకీయ ఉద్యమాలుగా మారుతున్నాయని నారాయణ చెప్పారు. మణిపూర్లో మైతేయిలను గిరిజన జాబితాలో చేర్చితే అసలు గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో ఒకే చట్టం సాధ్యం కాదన్నారు. మణిపూర్, నాగాలాండ్ ప్రజలు ప్రత్యేక దేశం కోరుతున్నారని తెలిపారు. మణిపూర్లోని కుకీ తెగలకు ఆయుధాలు సరఫరా చేసి వారిని భ్రమలో పెట్టి ఓట్లు దండుకున్నారని అక్కడ పాలకపక్షాన్ని విమర్శించారు. గతంలో గుజరాత్లో జరిగిందే ఇప్పుడు మణిపూర్లో జరుగుతుందన్నారు. సైనికుడి భార్యను వివస్త్రను చేసి ఊరేగించటం అత్యంత దారుణం అన్నారు. సైనికుల ఆయుధాలు టెర్రరిస్టు గ్రూపుల వద్ద ఉన్నాయని, 250 శవాలు ఆస్పత్రిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైస్తవ ఫాదర్లు పిల్లలకు చదువు చెప్పి మణిపూర్ను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
కార్పొరేట్ల కోసమే అల్లర్లు
మణిపూర్లో అత్యంత విలువైన ఖనిజ, అటవీ సంపదలను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు అక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు. 54 వేల ఎకరాల భూమిని అదానీకి మోదీ కట్టబెట్టారని తెలిపారు. మోదీ విదేశీ పర్యటనలకు వెళితే ప్రభుత్వ ఉన్నతాధికారులను కాకుండా కార్పొరేట్లను వెంట తీసుకెళతారని చెప్పారు. మోదీ ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లిన సందర్భంగా అదానీకి పెట్టుబడులు వచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ప్రశాంత వాతావరణాన్ని కల్పించవచ్చని సూచించారు.
వ్యవస్థలన్నీ భష్ట్రుపట్టిస్తున్నారు
నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తరువాత దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లతో పరిపాలన చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రం సీబీఐని పెంపుడు కుక్కలా వాడుకుంటుందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మంత్రులు జైలుకు వెళ్లారని, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరుగుతున్నా ఎవరూ జైలుకు వెళ్లటం లేదన్నారు. రఫేల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతిపై రిపోర్టు తయారు చేసినందుకు సీబీఐ డైరెక్టర్ను మార్చేశారని తెలిపారు. ఆర్ఎస్ఎస్, సంఫ్ు పరివార్ శక్తులు చేసిన మూసలో మోదీ వ్యవహరం నడుస్తోందన్నారు. ఫాసిస్టు తత్వంతో మోదీ పాలిస్తున్నారని చెప్పారు. అమెరికా తరహా అధ్యక్ష పాలన తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
చంద్రబాబు, పవన్ మాట్లాడాలి
మణిపూర్ అంశంపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతుంటే ఆంధ్ర ప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాలు నోరుమెదపటం లేదని, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. నిర్భయ చట్టం రావటానికి జరిగిన ఉద్యమాల స్ఫూర్తితో యావత్తు దేశం ఉద్యమించి మణిపూర్ ప్రజలకు అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగటంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రాజకీయాల్లో పసలేకపోతేనే వ్యక్తిగత విమర్శలు చేస్తారని చెప్పారు. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకుని మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేదన్నారు. మూడు వివాహాల కంటే కుటుంబ సభ్యుడిని హత్య చేయటం చాలా ప్రమాదం అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు సభ ఉద్దేశాన్ని వివరించారు. సభ రెండు నిమిషాలు మౌనం పాటించి మణిపూర్ మృతులకు సంతాపం తెలియజేసింది. తొలుత ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్, రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య, విజయవాడ నగర అధ్యక్షులు ఎస్.కె.నజీర్ అభ్యుదయ గీతాలు ఆలపించారు. ‘నగ్నంగా నడిచింది దేహం కాదు… అది దేశం…’, ‘యుగాలు దాటి వచ్చిన మనిషిని మృగాలుగా మార్చింది ఎవరూ…’ అంటూ మత సామరస్యాన్ని ప్రబోధించే పాటలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు స్వాగతం పలకగా, మరో సహాయ కార్యదర్శి లంక దుర్గారావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్ పాల్గొన్నారు.