మాటతప్పితే మళ్లీ పోరాటం
యూనియన్ నాయకులు సుబ్బారాయుడు హెచ్చరిక
విశాలాంధ్ర`విజయవాడ కార్పొరేషన్ : తమ హక్కులు, వేతనాల కోసం గత ఐదు రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తోన్న పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమస్యల పరిష్కారం, వేతనాల్లో కోత లేకుండా ఇస్తామని హామీ ఇవ్వటం హర్షణీయమని, మాటతప్పితే మళ్లీ పోరాటం చేపడతామని మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారా యుడు తెలిపారు. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో శుక్రవారం నిరసన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల గత్యంతరం లేక మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. కార్మికులు కొత్త కోర్కెలు, గొంతె మ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదని, ఇచ్చే చాలీచాల ని వేతనాల్లో కోతలు లేని వేతనాల కోసం పోరా టం చేస్తున్నారని తెలిపారు. నాలుగు రోజుల మున్సిపల్ కార్మికుల అకుంఠ దీక్షతో, ఐక్యంగా నిర్వహించిన పోరాటం ప్రభుత్వ పెద్దలను కదలిం చిందన్నారు. నిన్నకాక మొన్న వచ్చిన సచివాలయ సిబ్బందిని రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం దశాబ్దా లుగా ఎవ్వరూ చేయలేని పనులు చేస్తున్న మున్సి పల్ కార్మికులను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా విజయవాడ నగర పాలక సంస్థలో రోజుకు నాలు గుసార్లు మస్తరు విధానం అమలులో ఉందని, దీన్ని ఎత్తివేయాలన్నారు. విజయవాడ నగరాన్ని దేశంలో స్వచ్ఛతలో 3వ ర్యాంక్లో నిలబెట్టింది కార్మికులేనని నగర పాలక సంస్థ కమిషనర్, సంబంధిత అధికారులు గుర్తించాలని లేకుంటే సహించేది లేదన్నారు. కార్మికులు దొంగలు, ద్రోహులు కాదని, నాలుగుసార్లు ఐరిస్ విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాసన్, ఇతర అధికారులకు మెమోరాండం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆసుల రంగనాయకులు, నగర నాయకులు జేమ్స్, సీఐటీయూ నగర నాయకులు డేవిడ్, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.