పాత పింఛన్ విధానం అమలు
ఏఐఎఫ్యూటీఓ ధర్నాలో వక్తల డిమాండు
న్యూదిల్లీ: మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన విద్యావిధానం(ఎన్ఈపీ) ద్వారా విద్యారంగం ఖూనీ అవుతుందని, దీనిని వెంటనే ఉపసంహరించు కోవాలని అఖిలభారత విశ్వవిద్యాలయాలు, కళాశాల ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్యూటీఓ) డిమాండు చేసింది. ఎన్ఈపీ అంటే ఉన్నత విద్య వ్యాపారీకరణ, వర్గీకరణ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. దీంతో విద్యావ్యవస్థ సర్వనాశనమవుతుందని అన్నారు. ఏఐఎఫ్యూటీఓ అధ్వర్యంలో వివిధ రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాల నుంచి టీచర్లు దిల్లీలోని జంతర్మంతర్ వద్ద బుధవారం జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. విద్యారంగంలో ఎన్ఈపీ, సీయూఈటీ, ఎఫ్వైయూపీ, హెచ్ఈఎఫ్ఏ తదితర వ్యవస్థాగత మార్పులను తిరస్కరించారు. ఎన్ఈపీ అంటే ఉన్నత విద్య వ్యాపారీకరణ, వర్గీకరణ అంటూ నినదించారు. వక్తల్లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, ఏఐఎఫ్యూ సీటీఓ అధ్యక్షుడు కేశవ్ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ అరుణ్ కుమార్, డీయూటీఏ మాజీ అధ్యక్షుడు నందితా నరేన్, ఎఫ్ఈడీసీయూ టీఏ మాజీ అధ్యక్షులు దినేశ్ వర్షిణి తదితరులు ఉన్నారు. నూతన విద్యావిధానం (ఎన్ఈపీ) 2020కు వ్యతిరేకంగా వేలాది పిటిషన్లు, సూచనలు చేసినా కేంద్రప్రభుత్వం నుంచి స్పందనే కరువైన క్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది టీచర్లు ఎన్ఈపీకి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. 25 డిమాండ్లతో పత్రాన్ని విడుదల చేశారు. కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు టీచర్లపై కేంద్రప్రభుత్వం ఆన్లైన్ విద్యాభ్యాసం ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చిందని వక్తలు దుయ్యబట్టారు. విద్యారంగం అంతానికి ఎన్ఈపీ గురితప్పని విధానమని వ్యాఖ్యానించారు. దీనిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఒక్క దిల్లీ యూనివర్సిటీలోనే వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాత్కాలిక పద్ధతిలో 4వేల పోస్టుల భర్తీ జరిగిందన్నారు. టీచర్ల భర్తీని చేపట్టాలని డిమాండు చేశారు. పాత పింఛన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, కాలేజీ, వర్సిటీ టీచర్లకు ఏకరూప పింఛన్ పథకాన్ని అమలు చేయాలని, 7వ యూజీసీ వేతనాలు, పింఛన్ అమలు చేయాలని, కాలేజీల్లో సీఏఎస్ పదోన్నతుల కోసం ఆర్సీఐ ఓసీని డిసెంబరు 31 వరకు పొడిగించాలని, ప్రభుత్వ స్కూళ్ల విలీనాన్ని ఆపేయాలని, ఈసీసీఈ నుంచి పీజీ స్థాయి వరకు విద్యాహక్కు అమలు చేయాలని, శాశ్వత టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, నీట్, సీయూఈటీ, ఇతర కేంద్ర పరీక్షలను రద్దు చేయాలని, విద్య వర్గీకరణను విడనాడి కేజీ నుంచి పీజీ వరకు లౌకిక విలువలను పెంపొందించాలని, ఈసీసీఈ వర్కర్లు, మహిళా వర్కర్ల హక్కులకు హామీనివ్వాలని, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని, కీలక జాతీయ రంగాల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. ఏఐఎఫ్యూసీటీఓ డిమాండ్లకు పంజాబ్ Ê చండీగఢ్ కాలేజీ టీచర్స్ యూనియన్ (పీసీసీటీయూ), అఖిల కేరళ ప్రైవేట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్స్ (ఏకేపీసీటీఏ), హరియాణా గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (హెచ్జీసీటీఏ), బీహార్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (బీయూటీఏ), తమిళనాడు రిటైర్డ్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్, రాజస్థాన్ యూనివర్సిటీ Ê కాలేజీ టీచర్స్ అసోసియేషన్ మద్దతిచ్చాయి. ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్సీఎన్), ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఏఐఎస్ఈసీ) సంఫీుభావం తెలిపాయి