రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని వైసీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ జనాభాయేతర అంశాలైన ఆ రాష్ట్ర భూభాగము, అడవులు, జీవావరణం, ఆర్థిక అంతరాలు, జనాభా నియంత్రణ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఎప్పుడు చట్టం చేసినా అందులో పైన తెలిపిన జనాభాయేతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రక్రియను ఆయన ఆహ్వానిస్తూనే, అది చైతన్యవంతమైన భారత ఆధునిక ప్రజాస్వామ్యానికి చిహ్నం అవుతుందని అన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 888 సీట్లతో కొత్త పార్లమెంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయం సంతోషించదగ్గదే. అయినప్పటికీ నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందా అన్న అంశం ఆందోళన కలిగిస్తుందన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగిన పునర్విభజనలో దేశంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మాత్రం మారలేదు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఉత్తరప్రదేశ్ జనాభాలో 49.2 శాతం మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ జనాభాతో పోల్చుకుంటే ఏపీ జనాభా 6.8 శాతం తగ్గి 42.4 శాతానికి చేరింది. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా ఉత్తరప్రదేశ్ జనాభాలో కేవలం 39.6 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. లోక్సభ నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరిగితే ఉత్తర ప్రదేశ్లో లోక్సభ స్థానాల సంఖ్య 50 శాతం పెరిగి 120కి చేరుకుంటుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కేవలం 20 శాతం పెంపుతో 30 సీట్లకు పరిమితమవుతుందని అన్నారు. అందువల్ల డీలిమిటేషన్ కమిషన్ కోసం ఎప్పుడు చట్టం చేసినా జనాభాయేతర అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా చూడాలని, తద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియలో అన్యాయం జరగకుండా నివారించవచ్చని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
స్ఫూర్తి పథకం కింద ఏపీలో 16 క్లస్టర్లు
సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవ నిధి పథకం (స్ఫూర్తి) కింద ఆంధ్రప్రదేశ్లో 16 క్లస్టర్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్… విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కలంకారీ క్లస్టర్, తూర్పు గోదావరి జిల్లాలో ఆగ్రో ఇండస్ట్రీ, హార్టికల్చర్, ఫ్లోరీకల్చర్ ఉత్పాదనలు ప్రాసెస్ చేసే క్లస్టర్, గుంటూరు జిల్లా మంగళగిరిలో బంగారు నగల క్లస్టర్, విశాఖపట్నం జిల్లాలో కాఫీ క్లస్టర్, విజయనగరం జిల్లాలో కాయర్ (కొబ్బరి పీచు) ఉత్పాదనల క్లస్టర్, బంగారు నగల క్లస్టర్ పని చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 10 క్లస్టర్లలో పనులు కొనసాగుతున్నాయి. ఇందులో అత్యధికం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పని ప్రారంభిస్తాయని మంత్రి తెలిపారు.