మొదటి తప్పుగా, బాలయ్యకు స్పీకర్ తమ్మినేని హెచ్చరిక
ఏపీ అసెంబ్లీ తొలిరోజే వాడీవేడిగా మొదలైంది. తొలిరోజు సభ మొదలు పెట్టగానే చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.. అయితే నందమూరి బాలయ్య, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. బాలయ్య మీసం తిప్పగా.. మంత్రి రాంబాబు రా చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయగా.. మళ్లీ సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. అలాగే బాలయ్య మీసం తిప్పడంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి తప్పుగా వదిలేస్తున్నామని.. మీసాలు తిప్పడం వంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకూడదన్నారు. బాలయ్య సభా సంప్రదాయాలను ఉల్లంఘించారన్నారు. బాలకృష్ణ మొదటి తప్పుగా భావించి హెచ్చరిస్తున్నామని.. సభలో టీడీపీ సభ్యుల తీరు సరైనది కాదన్నారు. బాలయ్య తీరును సభ సీరియస్గా తీసుకుంది అన్నారు. అలాగే సభ్యులు సభలో ఏవైనా వస్తువుల్ని డ్యామేజ్ చేస్తే సభ్యుల నుంచే నష్టం వసూలు చేస్తామన్నారు. స్పీకర్ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. అలాగే మిగిలిన సభ్యుల్ని ఒకరోజు సస్పెండ్ చేశారు. అనంతరం సభను స్పీకర్ మరోసారి వాయిదా వేశారు. అంతకముందు సభలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. మంత్రి అంబటి రాంబాబుల మధ్య మాటల యుద్ధం నడిచింది. బాలయ్య స్పీకర్ పోడియం దగ్గర ఉండి మీసాలు మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వనిస్తున్నారని.. స్పీకర్పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారని.. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చేసుకోవాలని కౌంటరిచ్చారు. బాలయ్య, అంబటి చూసుకుందాం రా అంటూ సవాళ్లు విసురుకున్నారు.