వైసీపీనా? బీజేడీనా?
రాజ్యసభలో కీలక బిల్లులకు వాటి మద్దతు తప్పనిసరా?
ఎన్డీఏని జేడీ(యూ) వీడటంతో మారిన పరిణామాలు
న్యూదిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి జనతాదళ్ (యునైటెడ్) బయటకు రావడంతో జాతీయ రాజకీయాల్లోనే కాకుండా చట్ట సభల్లోనూ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక బిల్లులకు ఏవిధంగా మద్దతు పొందుతుందనేది కొంత ఆసక్తిగా ఉంది. రాజ్యసభలో కీలక బిల్లులు తీసుకురావడానికి బీజేపీ ఇప్పుడు బీజేడీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి పడాల్సి ఉంటుంది. జేడీ(యూ)కు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సహా ఐదుగురు సభ్యులున్నారు. హరివంశ్ పార్టీ జేడీ(యూ) కేంద్రంలోని అధికార కూటమి నుంచి వైదొలగడంతో ఇప్పుడు ఆయన భవితవ్యంపై అస్పష్టత నెలకొంది.
అయితే సీపీఎం నుంచి బహిష్కరణ తర్వాత కూడా సోమ్నాథ్ ఛటర్జీ లోక్సభ స్పీకర్గా కొనసాగారు. లోక్సభలో జేడీ(యూ)కు 16 మంది ఎంపీలున్నారు. కానీ దిగువ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. కాషాయ పార్టీకి 91 మంది సభ్యులు మాత్రమే ఉన్న రాజ్యసభలో బీజేపీకి సొంత మెజార్టీ లేదు. దీనికి ఇద్దరు స్వతంత్రులు, ఏఐఏడీఎంకే (నలుగురు ఎంపీలు)తో సహా మొత్తం 110 మంది ఎంపీల మద్దతు ఉంది. 245 మంది సభ్యుల సభలో సాధారణ మెజార్టీకి బీజేపీకి 123 మంది మద్దతు అవసరం. అధికార పార్టీకి మరో ముగ్గురు స్వతంత్రులు, అలాగే బీజేడీ లేదా వైసీపీ మద్దతు అవసరం ఉంటుంది. బిజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాజ్యసభలో చెరొక తొమ్మిదిమంది ఎంపీలను కలిగి ఉన్నాయి. ఇటీవల కాలంలో కీలక బిల్లుల ఆమోదం కోసం అధికార పార్టీకి వారు తమ మద్దతును అందించారు.
కాగా ఎన్డీఏకి మిత్రపక్షాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెందిన మరో 8 మంది ఎంపీలలో ఆర్పీఐ`ఎకి చెందిన రామదాస్ అతవాలే, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్కి చెందిన హిషే లంచుగ్పా, అసోం గణపరిషత్ (ఏజీపీ)కు చెందిన బీరేంద్ర ప్రసాద్ బైశ్యా, పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) సభ్యుడు అన్బుమణి రామదాస్, తమిళ మనీలా కాంగ్రెస్ (మూపనార్)కు చెందిన జీఏ వాసన్, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన వాన్వీరోయ్ ఖర్లూఖి, మిజో నేషనల్ ఫ్రంట్కు చెందిన కె.వన్లాల్వేనా, యునైటెడ్ పీపుల్స్ పార్టీ (లిబరల్)కు చెందిన రంగ్వ్రా నార్జారీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అంతేకాకుండా, ఇద్దరు స్వతంత్ర ఎంపీలు అసోం నుంచి అజిత్ కుమార్ భుయాన్, హరియాణా నుంచి కార్తికేయ శర్మ కూడా అధికార ఎన్డీఏలో ఉన్నారు.