. దిల్లీకి చేరనున్న వివాదం
. టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫిర్యాదులకు సన్నద్ధం
. 28న సీఈసీతో తొలుత చంద్రబాబు భేటీ
. వెంటనే వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఖరారు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలో పెద్దఎత్తున రికార్డుల్లోకి బోగస్ ఓట్ల చేరిక, మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్ల తొలగింపు వివాదం దిల్లీకి చేరనుంది. దీనిపై ఈనెల 28వ తేదీ దిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానుండగా, దీనికి పోటీగా అధికార వైసీపీ ఎంపీలు కూడా అదే రోజు ఎన్నికల సంఘానికి టీడీపీపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. 28న మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అపాయింట్మెంట్ ఇచ్చింది. దీంతో 27న సాయంత్రమే ఆయన దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. అధికారపార్టీకి చెందినవారు బల్క్గా ఫారం-7లు ఇవ్వడం పై సాక్ష్యాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. దొంగ ఓట్ల చేర్పింపు, టీడీపీకి చెందిన వారి ఓట్లను తొలగించడం, ఒకే ఇంటి నంబరుపై వందల సంఖ్యలో ఓట్లను చేర్చడం వంటి అక్రమాలపై బీఎల్ఓలకు ఫిర్యాదు చేసినా వాటిని తొలగించడం లేదని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బీఎల్ఓలు, మండల అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని తెలుగుదేశం చెబుతోంది. ఈ క్రమంలో వీటన్నింటిపైనా సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లు చేర్పు పెద్దఎత్తున కొనసాగిస్తుండగా, ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కేవలం 2022 జనవరి 6 తర్వాత తొలగించిన ఓట్ల పరిశీలనకే పరిమితం అవడంపై కూడా చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. 2020
21 సంవత్సరాల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా అనేక గ్రామాల్లో పెద్దఎత్తున తొలగించిన తీరు ఆధారాలతో సహా ఇప్పటికే రుజువైంది. దానిపై కొందరు అధికారులపై కూడా చర్యలు తీసు కున్నారు. ఇటువంటి ఘటనలు ఇతర నియోజకవర్గాల్లోనూ బయల్పడుతున్నాయి. అయినప్పటికీ ఎన్నికల సంఘం కటాఫ్ తేదీ నిర్ణయించి, జనవరి 2022 తర్వాత తొలగించిన ఓట్ల పున:పరిశీలనకే పరిమితం కావడం ఏమిటి ?