ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
ఆ తర్వాత కొద్దిగంటల్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఎన్నికల సమయంలో పాల్పడిన నేరాలకు సంబంధించి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పిన్నెల్లి ఇంతకాలం అరెస్టు కాలేదు. బుధవారం కూడా ఆయన మరోసారి ప్రయత్నించారు. కానీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేయడంతో పోలీసులు వెంటనే ఆయనను నరసరావుపేటలో అదుపులోకి తీసుకుని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వీరంగం సృష్టించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎం ధ్వంసం చేశారు. బయటకు వస్తున్న సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ ఇదేం పని అని నిలదీయటంతో ఆమెను తీవ్రంగా హెచ్చరిస్తూ దుర్భాషలాడారు. దీనిపై రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే, మరో 15 మందిపై సెక్షన్ 307, 147, 148, 120బీ, 324, రెడ్విత్ 149 ఐపీసీ కింద రెంటచింతల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. తనను చంపేయాలని పిన్నెల్లి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పినట్టు శేషగిరిరావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రామకృష్ణారెడ్డిని ఏ-1గా చేర్చారు. దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు చింతా సుబ్బారావు, మరికొందరిని కేసులో చేర్చారు. అలాగే మే 14న పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు. రౌడీమూకలతో టీడీపీ కార్యాలయంపై దాడిచేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి టీడీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తూ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. దీనిపై వీఆర్వో ఫిర్యాదు మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మరికొందరిపై సెక్షన్ 307, 332, 143, 147, 324, 149 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి తనను అరెస్టు చేస్తారనే భయంతో పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్ల నియామకానికి ఇబ్బంది లేకుండా ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే నంబూరి శేషగిరిరావు దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిన్నెల్లిని అరెస్టు చేయకపోవటంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు వెంటనే తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పింది. హైకోర్టులో పిన్నెల్లి బెయిల్ పిటిషన్ ఆ తర్వాత విచారణకు వచ్చినా తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు. బుధవారం బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో పిన్నెల్లిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.