మంగళగిరి: మంగళగిరి పట్టణంలో ఏపీఎస్పి శ్రీరామ్ నగర్ కాలనీ లోని వర్షపు నీరు బయటికి వెళ్లకపోవడంతో కాలనీ వాసులు, ఏపీఎస్పి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. కాలనీలోని వర్షపు నీరు శ్రీరామ్ నగర్ కాలనీ, ఏపీఎస్పీ బెటాలియన్ లోకి వెళ్లే బైపాస్ వద్ద రోడ్డు ప్రారంభంలో కాలనీలోని వర్షపు నీరు ఇక్కడ ఉన్న పెద్ద కాలువ నుండి బయటకు వెళ్తూ ఉంటాయి. అయితే బైపాస్ నుండి కాలనీలోకి వెళ్లే ప్రారంభంలో ఓ కమర్షియల్ అపార్ట్మెంట్కు చెందిన వాళ్లు అపార్ట్మెంట్ లోకి వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నదని కాలువ పూడ్చి చిన్న పైపులైన్ వేయడంతో కాలనీలో నుంచి వచ్చిన వర్షపునీరు బయటికి వెళ్లే మార్గం చిన్నది అవడంతో వర్షపునీరు మొత్తం నిలిచిపోయి చెరువుగా ఉంటుంది. దీంతో కాలనీలోకి వెళ్లే ప్రజలు, బెటాలియన్ కి వెళ్ళే సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రెండు రోజులపాటు వర్షపు నీరు నిలిచిపోయి ఉంటుంది. దీంతో కాలనీవాసులు, వాహనచోదకులు, బెటాలియన్ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఇదే మార్గం నుంచి కమాండెంట్, ఐజి వంటి ఉన్నతాధికారులు కూడా ఇదే మార్గంలో వెళ్లడం గమనార్హం. ప్రైవేట్ అపార్ట్మెంట్కు చెందిన వారు తమ వాహనాల రాకపోకలకు పెద్ద కాలువ పూడ్చివేసి చిన్న పైపు వేయడం వలన నీటిపారుదల బయటకు వెళ్ళటం నిలిచిపోయే తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఆత్మకూరు పంచాయతీ అధికారుల దృష్టికి ఎన్ని సార్లు సమస్యను తీసుకెళ్ళిన ప్రయోజనం లేదని శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, హైకోర్టు ఏజిపి ఏ షణ్ముఖరెడ్డి, ఉపాధ్యక్షులు తాటి కృష్ణారావునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలోకి కాలనీ వచ్చిన నేపథ్యంలో నగర పాలక సంస్థ అధికారులైనా తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. భారీ వర్షానికి చినకాకాని ఎన్నారై ఆసుపత్రి రహదారి జలమయమైంది.