జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి
గుంటూరు: కొవిడ్
19 మూడో దశ ముప్పు ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా మొదటి, రెండు దశల్లో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో వేవ్లో చిన్నపిల్లల వైద్యులతో పాటు నర్సులు, ఎంఎన్ఓ, ఎఫ్ఎంఓ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ పోస్టులకు ఆరు నెలల ప్రాతిపదికన నియామకాలను చేపడుతున్నట్లు వివరించారు. నియమ నిబంధనల మేరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, పీడియాట్రిక్ విభాగంలో 46పోస్టులు విద్యార్హతలు బట్టి ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. 54 స్టాఫ్ నర్సుల పోస్టులకు నర్సింగ్ బోర్డు రిజిస్టర్ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా ఎంఎన్ఓ, ఎఫ్ఎంఓ 36 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్లను రెండు సెట్లు జిరాక్సీ కాపీలను తీసుకుని రావాలని కోరారు. ఈనెల 6వ తేదీన తన. ఛాంబరులో హాజరు కావాల్సిందిగా ఆమె కోరారు. కోవిడ్ కేంద్రంలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు.