సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రజా సంఘాల లేఖ
విశాలాంధ్ర`గుంటూరు వైద్యం : క్రూరమైన నిర్బంధ చట్టమైన ఉపాను రద్దు చేయాలని ఉపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్ చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక యూటీఎఫ్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో చిలుక చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రజాసంఘాల నాయకులు ఉపచట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల కాలంలో స్వతంత్య్ర సమరయోధులపై ప్రయోగించిన క్రూర నిర్బంధ చట్టాన్ని నేటి పాలకులు ప్రజా సమస్యలపై పోరాడే ఉద్యమకారులపై ప్రయోగించటం అత్యంత పాశవికమన్నారు. ఈ చట్టం రాజ్యాంగం ప్రసాదించిన నిరసన తెలిపే హక్కును కాలరాస్తుందన్నారు. ఈ చట్టాన్ని ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తూ కవులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు, పర్యావరణకారులను ఎటువంటి బెయిల్ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో నిర్బంధిస్తున్నారన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను పూర్తిస్థాయిలో ప్రమాదంలోకి ఈ చట్టం నెట్టి వేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న 386 కేసులలో, 312 కేసులు ఉపా కింద నమోదైనవని, అందులో 56 శాతం కేసులలో సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదని తెలిపారు. బావ ప్రకటన స్వేచ్ఛకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వాన్ని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఆదేశించాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఉపా చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పిడిఎం రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.అంజమ్మ, కేఎన్పిఎస్ జిల్లా అధ్యక్షులు బి.విజయభాస్కరరావు, పీకేఎస్ జిల్లా కార్యదర్శి డి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.