విశాలాంధ్ర`దుగ్గిరాల : ఎంతో విశిష్టత కలిగిన శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో కల్యాణ మండపం, విశ్రాంతి గదులు నిర్మించడం సంతోషదాయకమని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశ్రాంతి గదులు, కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకులు తారకనాథ్, సుబ్రహ్మణ్య శర్మ వేదమంత్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.1.20 కోట్లతో నిర్మాణం చేపట్టిన విశ్రాంతి గదులు, కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఆర్కే మాట్లాడుతూ దాతలు దొంతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో రూ.40 లక్షలతో కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమన్నారు. ఆలయ అభివృద్ధి కోసం దేవదాయ శాఖ నుంచి రూ.70 లక్షలు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూప వాణి, జడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, ఆలయ ఈవో వెంకటరెడ్డి, సర్పంచ్లు యార్లగడ్డ చంద్ర దుర్గాభవాని, ఇత్తడి రమేష్, బోల శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండూరు ముత్తయ్య, ఆలయ ట్రస్ట్ దేవా భక్తునీ రంగ ప్రసాద్, వైసీపీ నాయకులు దానబోయిన వెంకటేశ్వరరావు, దాసరి వీరయ్య, ఉన్నం రాజేష్, యార్లగడ్డ సుబ్బారావు, షేక్ సుభాని, వడ్డేశ్వరపు రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.