విశాలాంధ్ర`పొన్నూరు : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిని వెలుగులోకి తెస్తూ గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ డిజిటల్ క్యాంపియన్లో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడి, తాళ్లపాలెం, దొప్పలపూడి గ్రామాలలో ఉన్న ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్ల దుస్థితిని తెలియపరుస్తూ జనసేన పార్టీ నాయకులు ప్లకార్డుల నిరసన వ్యక్తం చేశారు. గుంతలను చూపిస్తూ గ్రామాలలో జనసేన పార్టీ నాయకులు కార్యక్రమం తలపెట్టారు. గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు గుంతల మయంగా మారటంతో వేలాదిమంది ప్రమాదాలకు గురి కావటమే కాక వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని వారు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రాథమికంగా ప్రజల అవసరాలు తీర్చటంలో సీఎం విఫలమయ్యాడని వారు ఆరోపించారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన కార్యక్రమం 15, 16, 17 రోడ్లు దుస్థితిని తెలుపుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ప్రజాభాగస్వామ్యంతో అన్ని రాజకీయ, ప్రజాసంఘ నాయకులు జనసేన పార్టీకి మద్దతు తెలిపి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని తలవంచే విధంగా మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులతోపాటు వీర మహిళలు పాల్గొన్నారు.