విశాలాంధ్ర`మాచవరం : సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి తెలిపారు. ఈ నెల 20, 21 తేదీలలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే మహాసభలకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. శుక్రవారం మండల కేంద్రమైన మాచవరంలో సీపీఐ మండల పార్టీ అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసే పార్టీ సీపీఐ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై అధికంగా పన్నుల భారాలను మోపుతుందన్నారు. అంతేకాకుండా రైతులకు పొలాల్లోని పంపు చెట్లకు కరెంటు మీటర్లు బిగించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే కొనసాగేలాగా చూడాలన్నారు. మండల కేంద్రమైన మాచవరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన జరిగే జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర నాయకులు కె.రామకృష్ణ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్కుమార్, పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కార్యదర్శులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, ముకపాటి సాంబయ్య, మీరస, షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.