సవాళ్ళు… ప్రతి సవాళ్ళతో కొనసాగిన సమావేశం
విశాలాంధ్ర`చిలకలూరిపేట రూరల్ : సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. వాగ్వాదం నడుమ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కొనసాగింది. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ముందుగా ఎజెండాలోని అంశాలను శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ చదివి వినిపించారు. అనంతరం నూతనంగా మున్సిపల్ కార్యాలయంలో విధుల్లో చేరిన వారు సభ్యులతో పరిచయం చేసుకున్నారు. ఎజెండాలోని అంశాలు చదవటం పూర్తి కాగానే వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఆదివాసి మహిళ అయిన ద్రౌపదీ ముర్మూ దేశ రాష్ట్రపతి స్థానం అలంకరించటం పట్ల సమావేశం అభినందనలు తెలిపాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ రపాని ద్రౌపదీ ముర్మూ భారతదేశ రాష్ట్రపతిగా పదవీ చేపట్టడాన్ని యావత్తు దేశ ప్రజలు సగర్వంగా స్వాగతించారని తెలిపారు. అనంతరం టీడీపీ కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు లేచి పురపాలక సంఘ పరిధిలో పారిశుధ్యం అధ్యాన్నంగా ఉందని, విషజ్వరాలు ప్రబలుతున్నాయని, ఆసుపత్రుల్లో ప్రజలు కిటకిటలాడుతున్నారని ఆరోపించారు. గడపగడపకు కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పర్యటిస్తున్నారని, ఫొటోలకు మాత్రమే ఆమె వచ్చి వెళుతున్నారని విమర్శించారు. ఈ అంశంపై పదో వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, ఇతర వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ రఫాని ఈ అంశంపై జోక్యం చేసుకుంటూ సభను పక్కదారి పట్టించే వ్యాఖ్యలు చేయరాదని, మంత్రిపై చేసిన వ్యాఖ్యలు సరిjైునవి కావని అభ్యంతం వ్యక్తం చేశారు. పారిశుధ్యం విషయంలో చిలకలూరిపేట మున్సిపాలిటీ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే ప్రధమ స్థానంలో ఉందని, పార్టీలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ది మీకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. కౌన్సిలర్ మౌలాలి మాట్లాడుతూ తన 10వ వార్డులో రూ.40 లక్షల అభివృద్ధి జరిగిందని… పరిశీలించవచ్చని అన్నారు. అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని మౌలాలి సవాల్ విసిరారు. ప్రతిపక్ష సభ్యులు వార్డుల్లో పర్యటించాలని వార్డులలో పర్యటించకుండా కేవలం ఆరోపణలకే పరిమితమవుతున్నారని మౌలాలి అన్నారు. ఇదే అంశంపై మున్సిపల్ కమిషనర్ సీహెచ్ గోవిందరావు స్పందిస్తూ చిలకలూరిపేటలో పారిశుధ్యం మెరుగ్గా ఉందని, 70 శాతం ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నామని వెల్లడిరచారు. కౌన్సిల్ సభ్యులు ఎవరైనా ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించటానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. అనంతరం ఇదే అంశంపై వివాదం కొనసాగింది. టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సమయంలోనే చైర్మన్ రఫాని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సమావేశం ముగిసిందని ప్రకటించారు.