విశాలాంధ్ర`తాడికొండ : నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ తహశీల్థార్ కార్యాలయం వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శనివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం పొన్నెకల్లు గ్రామానికి చెందిన పాముల సాయమ్మ అనే వృద్ధురాలు కుటుంబ కలహాల నేపథ్యంలో ఫిబ్రవరి 28, 2000 సంవత్సరంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు కర్మకాండలు పూర్తి చేశారు. అయితే కుటుంబానికి డెత్ సర్టిఫికెట్ అవసరమైంది ఆనాడు పంచాయతీలో సాయమ్మ పేరు నమోదు కాలేదు. తహశీల్థార్ కార్యాలయం నుంచి సర్టిఫికెట్ తీసుకునేందుకు సాయమ్మ కోడలు పద్మ మనుమడు సుమన్ అర్జీ పెట్టుకున్నారు. రెండున్నర సంవత్సరాలైన సర్టిఫికేట్ ఇవ్వటం లేదని, ఈ నేపథ్యంలో తమను ఎంతకాలం కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిప్పుకొంటారంటూ సాయమ్మ మనుమడు సుమన్ పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు వారించారు. ఈ విషయమై తహశీల్థార్ ఫణీంద్ర బాబును వివరణ కోరగా గత నెల 22న డెత్ సర్టిఫికెట్ కోసం అర్జీ పెట్టుకున్నారని డెత్ తేదీ సక్రమంగా లేకపోవడంతో దానికి సంబంధించిన వివరాలను తీసుకువస్తే సర్టిఫికేట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తహశీల్థార్ తెలిపారు. అయినా సుమన్ తమ మాటలను వినకుండా ఒంటిపై పెట్రోలు పోసుకున్నారని తెలిపారు.