వాతావరణ మార్పులపై శాస్త్రజ్ఞుల హెచ్చరిక
2021లో గరిష్ఠాన్ని తాకిన మిథేన్
31శాతం కరిగిన హిమనీ నదాలు
న్యూయార్క్ : మరో పదేళ్లకు గ్రీన్హౌస్ ఉద్గారాలు 50శాతం క్షీణించాలని శాస్త్రవేత్తలు పునరుద్ఘాటించారు. 1.5సి పరిధిలో ఉండేందుకుగాను 2050 నాటికి దశలవారీగా కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. ఐరాస సైన్స్ నివేదికను ధృవీకరించడానికి దాదాపు 200 దేశాలు ఆన్లైన్లో చర్చలు ప్రారంభించాయి. వీరు ఖరారు చేయవలసిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్యమైనదిగా ప్రపంచ వాతావరణ సంస్థ అధిపతి పెట్టెరి తలాస్ జూమ్ ద్వారా 700మంది ప్రతినిధులకు చెప్పారు. మూడు ఖండాల్లో చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్య పరిణామాలకు ప్రధాన కారణం గ్లోబల్వార్మింగ్గా పేర్కొన్నారు. రికార్డుస్థాయిలో వడగాడ్పులు, వరదలు, కరువు పరిస్థితులు ఈ మూడు ఖండాల్లో చోటుచేసుకున్నాయి. నవంబరులో గ్లాస్గో వాతావరణ సదస్సు విజయానికి వాతావరణమార్పులపై అంతర్ ప్రభుత్వాల కమిటీ అంచనా కీలకమైనదిగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై కీలకమైన జీ20 శిఖరాగ్ర సదస్సు అక్టోబరు చివరిలో జరగనుంది. శిలాజ ఇంధనాలు, మీథేన్ లీకేజీలు, వ్యవసాయం నుండి వచ్చే కార్బన్ కాలుష్యం ఇప్పటివరకు 1.1 డిగ్రీల సెల్సియస్ను పెంచింది. లండన్లో జరిగిన రెండు రోజుల మంత్రిత్వస్థాయి సదస్సులో బొగ్గు భవితవ్వంపై భిన్నవాదనలు వినిపించాయి. గ్లాస్గో సమావేశంలో వీటిని పరిష్కరించవలసి ఉంది. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా కాలుష్యం తగ్గినప్పటికీ వాతావరణంలో మీథేన్ స్థాయిలు గరిష్టాలను తాకిందన్నారు. గ్రీన్లాండ్, అంటార్కిటికా ఖండాల్లో హిమనీ నదాలు 15 సంవత్సరాల క్రితం కంటే 31శాతం వేగంగా కరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అత్యవసర స్థితిని ప్రకటించే నివేదికపై సంతకం చేసిన 14వేల మంది శాస్త్రవేత్తలు ప్రకటించారు. బ్రెజిల్, అమెజాన్ అడవుల వార్షిక నష్టం 2020లో 12 సంవత్సరాల గరిష్టానికి చేరింది. అమెరికా పశ్చిమతీరం, కెనడాలో ఇటీవలి కాలంలో రికార్డుస్థాయిలో నమోదైన వేడి తరంగాలు వాతావరణంలో దిగ్భ్రాంతికర మార్గాలుగా సూచించారు.