ఇస్తాంబుల్లో టర్కీ కమ్యూనిస్టు పార్టీ భారీ ప్రదర్శన
ఇస్తాంబుల్: గెజి పార్క్ రెసిస్టెన్స్ (ప్రతిఘటన)కు పదేళ్లు అయిన సందర్భంగా టర్కీ కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో ఇస్లాంబుల్లోని ఇస్టిక్లాల్ వీధిలో గురువారం భారీ ప్రదర్శన జరిగింది. ‘ఎవరికీ తలవంచకు’ నినాదంతో పదేళ్ల కిందట జరిగిన ప్రతిఘటన స్ఫూర్తితో భవిష్యత్లో ఆందోళనలు కొనసాగించాలని పిలుపునిచ్చింది. పదేళ్ల కిందట అటాతుర్క్ సాంస్కృతి కేంద్రంపై ‘డోన్డ్ బౌ డౌన్’ (తలవంచకు) బ్యానర్ పెట్టినప్పటి నుంచి ఈ నినాదం ఉద్యమ నినాదంగా మారిపోయింది. డెమిరోరెన్ షాపింగ్ మాల్పై మరోమారు ఇదే బ్యానర్ను తాజా ప్రదర్శన క్రమంలో ఏర్పాటు చేశారు. ‘ప్రతిచోట టాకిమ్… ప్రతిచోట ప్రతిఘటన’, ‘తలవంచకు’, దేశాన్ని తిరిగి తీసుకో’, ‘ఇది ఆరంభం మాత్రమే… పోరాటాలు కొనసాగించాలి’ వంటి నినాదాలలో ఇస్టిక్లాల్ వీధి హోరెత్తింది. ప్రదర్శనలో టీకేపీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత పోలీసులు టంకం కలిగినప్పటికీ ప్రదర్శన విజయవంతమైంది. ‘తలవంచని వారు తప్పక గెలుస్తారు’ అన్న నినాదంతో టీకేపీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంతటి ఒత్తిడి ఎదురైనా మన ఆశల ప్రపంచం కోసం పోరాడదాం’ అని పిలుపునిచ్చింది. తాజా నిరంకుశ పాలన తమ దేశాన్ని అంధకారంలో ముంచేసిందని, దీనిని ఛేదించి వెలుగులోకి అడుగు పెడదామని శ్రేణుల్లో ఆశలు నింపింది. నైరాశ్యానికి ఇది సమయం కాదని, దానిని పూర్తిగా పాలద్రోలుతామని టర్కీ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ‘మనమంతా భుజం భుజం కలిపి నిలుచుంటే ఎంత బలంగా ఉండగలమన్నది జూన్ ప్రతిఘటన చూపించింది. ఏకేపీ (అధికార పక్షం) సృష్టించిన అంధకరం మమ్మల్ని కమ్మేయలేదని రుజువైంది. మనం ఐక్యంగా దీనిని ఛేదించగలం.. మనం ఆకాంక్షించిన సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలం. నైరాశ నిస్ప్రుహలకు సమయం లేదు. మన దేశం కోసం పోరాడదాం. ప్రజా పాలన ఏర్పాటు చేసుకుందాం. అప్పుడే ప్రజలు సుఖసంతోషాలతో బతకగలరు. ఇదే మా హామీ. మనల్ని విజయం తప్పవ వరిస్తుంది. మేము విజయవంతలవుతాం’ అని టీకేపీ పిలుపునిచ్చింది.