టెగూసిగాల్ప : హోండూరాస్ దేశాధ్యక్షురాలు జియోమారా కాస్ట్రో జూన్ 9-14 వరకు చైనాలో పర్యటించనున్నారు. హోండూరాస్ రాజధాని టెగూసిగాల్పలో చైనా… రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి దేశాధ్యక్షురాలు జియోమారా హాజరు కాలేదు. అయితే ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా చైనా పర్యటన గురించి ప్రకటించారు. ‘చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు నేను జూన్ 9 నుండి 14 వరకు ఓ ప్రత్యేక మిషన్తో చైనాను సందర్శిస్తాను. హోండూరాస్ పునర్నిర్మాణానికి శాస్త్రీయ, సాంకేతిక, వాణిజ్య, సాంస్కృతికం వంటి రంగాల్లో చైనా సాయం కోరనున్నాం’ అని పేర్కొన్నారు. జియోమారా పర్యటనపై హోండూరాస్ విదేశాంగమంత్రి ఎడ్వర్డో ఎన్రిక్ రీనా మాట్లాడుతూ… ‘అధ్యక్షురాలు జియోమారా చైనా అధికారిక పర్యటన మాకెంతో శుభవార్త. ఈ పర్యటనలో రెండు దేశాలకు సంబంధించిన కొన్ని ఒప్పందాలపై ఆమె సంతకం చేయనున్నారు’ అని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు.