Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

నిజమైన యుద్ధానికి సిద్ధం కండి

ఉ.కొరియా సైనిక విన్యాసాల్లో కిమ్‌ ఆదేశాలు
సియోల్‌: సైన్యాన్ని నిజమైన యుద్ధం కోసం సిద్ధం చేయాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ శుక్రవారం వెల్లడిరచింది. తన రెండో కుమార్తెతో కలిసి సైనిక విభాగం ఫైర్‌డ్రిల్‌ను పర్యవేక్షించినట్టు పేర్కొంది. అధికారిక మీడియా విడుదల చేసిన ఫోటోల్లో కిమ్‌, ఆయన కుమార్తె ఇద్దరూ అధికారులతో కలిసి ఫిరంగి దళం చేపట్టిన క్షిపణి ప్రయోగాన్ని వీక్షించారు. గురువారం బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించామన్న దక్షిణ కొరియా సైన్యం.. అదే ప్రదేశం నుంచి అనేక ప్రయోగాల అవకాశాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. హస్వాంగ్‌ యూనిట్‌ ఒకేసారి ఆరు క్షిపణులను పరీక్షించిందని, దాడుల కోసం ఈ మిషన్‌ శిక్షణ తీసుకుందని కేసీఎన్‌ఏ అధికారులు ఫోటోలను విడుదలచేశారు. కొరియా పశ్చిమ సముద్ర లక్షిత జలాల్లోకి హస్వాంగ్‌ విభాగం శక్తివంతమైన క్షిపణులను పరీక్షించినట్టు తెలిపింది. ఈ డ్రిల్‌ను పరిశీలించిన కిమ్‌ రెండు వ్యూహాత్మక మిషన్లు అంటే యుద్ధాన్ని నిరోధించడం.. యుద్ధంలో చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సైనికులకు సూచించారు. ఇటువంటి యూనిట్లు నిజమైన యుద్ధం కోసం వివిధ పరిస్థితులలో విభిన్న రీతిలో వివిధ అనుకరణ విన్యాశాలను తీవ్రతరం చేయాలన్నారు. దక్షిణ కొరియా, అమెరికా ఐదేళ్లలోనే అతిపెద్ద సంయుక్త సైనిక విన్యాసాలను సోమవారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్తర కొరియా విన్యాశాలు నిర్వహించింది. ఉభయ కొరియా దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉత్తర కొరియా మరింత రెచ్చగొట్టేలా అణ్వాయుధ, క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా అమెరికాతో భద్రతా సహకారాన్ని దక్షిణ కొరియా తీసుకుంటోంది. అమెరికాకు కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఈమధ్యనే హెచ్చరికలు చేయడం తెలిసిందే. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు అభ్యంతరం తెలిపారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే, అది ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తామని తేల్చిచెప్పారు. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతోందని, అందుకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్య అయినా సరే యుద్ధ ప్రకటనే అవుతుందని కిమ్‌ యో జోంగ్‌ స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img