లండన్: బ్రిటన్లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ తేల్చిచెప్పారు. అక్రమ వలసల కట్టడికి కొత్త చట్టాన్ని తెచ్చారు. బ్రిటన్లో చొరబాట్లకు తావులేదని సునాక్ ట్విట్టర్లో వెల్లడిరచారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే అదుపులోకి తీసుకొని, తిరిగి పంపిస్తామన్నారు. సొంత దేశంలో వారికి ప్రమాదం ఉందని తెలిస్తే మరో దేశానికి తరలిస్తామని ట్వీట్లో పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నాసరే మా దేశంలోకి మళ్లీ ప్రవేశించకుండా నిషేధిస్తామని హెచ్చరించారు. ఇంగ్లీష్ ఛానల్ గుండా చిన్న పడవల్లో అక్రమంగా ప్రవేశించే వాళ్లపై బ్రిటన్ ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. గతేడాది సౌతీస్ట్ ఇంగ్లండ్ గుండా 45 వేలమంది బ్రిటన్కు చేరుకున్నారు. ఐదేళ్లలతో పోల్చితే వలసలు వార్షికంగా 60 శాతం పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే సునాక్ తాజా నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు, బ్రిటన్లోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కొత్త చట్టంపై అంతర్జాతీయ సమాజం నుంచి అభ్యంతరం వ్యక్తం కావొచ్చని ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ పేర్కొంది. అది అమలయ్యే అవకాశం లేదని తెలిపింది. ఈ చట్టంతో దుర్బల పరిస్థితుల్లో ఉన్న శరణార్థులు బలి పశువులు అవుతారంటూ మానవహక్కుల సంఘాలు పేర్కొన్నాయి. యూరోపియన్ మానవ హక్కుల చట్టంలోని ఇతర హక్కులను తుంగలో తొక్కారని విమర్శించాయి. కొత్త చట్టం అక్రమ వలసలపై ఉక్కుపాద విధానమని బ్రిటన్ హోం మంత్రి, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మాన్ ఓ ప్రకటనలో తెలిపారు.