వాషింగ్టన్: టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏమిటి? తన ట్వీట్లతో తరుచూ వార్తల్లో నిలిచే ఎలన్ మస్క్ సోమవారం మరో వివాదాస్పద ట్వీట్ పోస్ట్ చేశారు. ఇటీవల 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను కొనుగోలు చేసిన ఆయన ఆ ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ‘ఒకవేళ తాను అనుమానాస్పద రీతిలో మరణిస్తే.. ఆ విషయం అందరికీ తెలియడం అవసరం’ అని ఆయన ట్వీట్ చేశారు. ఎలన్ మస్క్ చేసిన ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. రష్యా అంతరిక్ష సంస్థ రాస్కాస్మోస్ డైరెక్టర్ దిమిత్రీ ఒలెగోవిచ్ రోగోజిన్ నుంచి తనకు సందేశం అందినట్లు మస్క్ పేర్కొన్నారు. రష్యన్ భాషలో ఉన్న ఆ సందేశాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లోని నాజీ మిలిటరీ బృందాలకు కమ్యూనికేషన్ పరికరాలు అందిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆ సందేశంలో ఉంది. మస్క్ నియంతృత్వ శక్తులకు సహకరిస్తున్నారని, దీనికి కచ్చితంగా ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరియుపోల్లో ఉక్రెయిన్ సేనలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నట్లు తమకు బందీగా చిక్కిన ఆ దేశ మెరైన్ బ్రిగేడ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పినట్లు మస్క్కు పంపిన లేఖలో రోగోజిన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఉక్రెయిన్ సేనలు, వారికి మద్దతిస్తున్న వారిని నాజీలుగా వ్యవహరించారు.