కాబూల్ : అఫ్గాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు వ్యాపించాయి. ప్రజల నిరసనల సెగతో అఫ్గాన్లో వివిధ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. తాలిబన్లు దేశ రాజ ధానిలో పార్లమెంటు భవనంలోకి వెళ్లి జాతీయ పతాకాన్ని దింపి తమ జెండాను ఎగురవేయడంతో స్థానికులలో నిరసన ప్రజ్వరిల్లింది. పార్లమెంటుపై మళ్లీ జాతీయ జెండాను ఎగురవేయాలని నినదించారు. ఈ ర్యాలీపై తాలిబన్లు తూటాల వర్షం కురిపించారు. అఫ్గాన్్ జెండా ఎగరేసినవారిపై తాలిబన్లు బుధవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 10 మందికిపైగా గాయపడ్డారు. నిరసనకారులపై తాలిబన్లు కాల్పులకు తెగబడడంతో తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రజలు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. మరోవైపు తాలిబన్లు ప్రజలపై కాల్పులు జరిపినా, దాడులు చేపట్టినప్పటికీ ఖోస్ట్లో ప్రజలు జాతీయ జెండాను ఎగురవేసారు. కాబూల్లోని వజీర్ అక్బర్ ఖాన్లో, నలుపు, ఆకుపచ్చ హిజాబ్లు ధరించిన నలుగురు మహిళలు తమకూ సమాన హక్కులు, రాజకీయాలలో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసించారు.
మరోపక్క అఫ్గాన్ను వశం చేసుకున్న తాలిబన్లు మొదటిసారి మీడియాతో సమావేశమయ్యారు. ‘‘అఫ్గానిస్తాన్ విముక్తి పొందింది. మేం ప్రతీకారం తీర్చుకోం.. 20ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం..అంతర్గతంగా, బైటనుంచి శత్రుత్వం తాము కోరుకోవడంలేదని..మహిళల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లనివ్వం’’ అని తాలి బన్లు ప్రకటించారు. ప్రజల ఇళ్లలో సోదాలు, దాడులు ఉండవన్నారు. అఫ్డాన్లో ఇతరులకు హాని తలపెట్టం. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తాం…వైద్య, ఇతర రంగాలలో వారు పనిచేయవచ్చు. మీడియాపై ఎటువంటి ఆంక్షలు విధించబోమని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజహిద్ అన్నారు. మీడియాకు మూడు కీలక ప్రకటనలు చేశారు. ఏ ప్రసారమూ ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఉండరాదు. నిష్పక్షపాతంగా ఉండాలి..జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదీ ప్రసారం చేయకూడదు.’’ అని పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధిలో మెరుగుదలకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు దిశగా
అఫ్గాన్ను హస్తగతం చేసుకున్నతాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు దిశంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాలిబన్ కమాండర్, హక్కాని నెట్వర్క్ గ్రూపు సీనియర్ నేత అనాస్ హక్కాని, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్తో సంప్రదింపులు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఈ భేటీలో కర్జాయ్ సహా గత ప్రభుత్వంలో శాంతిదూతగా ఉన్న అబ్దుల్లా అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. అయితే దీనిపైఎటువంటి వివరాలు బహిర్గతం కాలేదు. ఈ వివరాలను స్థానిక టోలో న్యూస్ వెల్లడిరచింది. అఫ్గాన్ను తాలిబన్లు లోబరచుకోవడంలో హక్కాని నెట్వర్క్ది కీలకపాత్ర. అఫ్గానిస్తాన్ పేరును ఇస్లామిక్ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గనిస్తాన్గా మార్చడంతోపాటు ఇస్లామిక్ షరియా చట్టాల అమలుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
భారీగా క్షీణించిన అఫ్గాన్ కరెన్సీ
అఫ్గాన్ కరెన్సీ ఒక్కసారిగా గణనీయంగా క్షీణించింది. దేశ అధ్యక్షుడు, తాత్కాలిక సెంట్రల్ బ్యాంకు గవర్నర్ పారిపోవడంతో పెట్టుబడిదారులు దేశం నుంచి వెళ్లేందుకు నిర్ణయించారు. దీనితో అఫ్గాన్ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో 4.6శాతానికి క్షీణించింది. ప్రస్తుతం కరెన్సీ విలువ 81 నుంచి దాదాపు 100కు పెరిగి తర్వాత 86కు చేరుకుంది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గ్గాన్కు సంబం ధించిన నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.
అమెరికా ఎత్తుగడలు
అమెరికా సామ్రాజ్యవాద దురహంకారపూరిత చర్యలవల్లే అఫ్గాన్లో తాలిబన్లు పేట్రేగిపోయారన్న అపవాదును మూటగట్టుకుంటున్న అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. మిత్రదేశాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది. తాలిబన్లు కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంపై కఠిన ఆంక్షలను విధించే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోంది. అంతర్జా తీయ సమాజం నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ను వినిపించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అఫ్గాన్ పౌరుల మానవహక్కులకు భంగం కలిగించకుండా ఈ చర్యలు ఉండాలనేది అమెరికా యోచన. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు ఫోన్ చేశారు. తాలిబన్ల వ్యవహారంలో ప్రజాస్వామిక దేశాలతో కూటమిగా ఏర్పడటం సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చేవారం జి7 సమా వేశాన్ని వర్చువల్గా నిర్వహించాలని బైడెన్ ప్రస్తావనను జాన్సన్ అంగీకరించారు. ఈ మేరకు వైట్హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కలిసివచ్చే దేశాలను కలుపుకోవలసి ఉంటుందని వారు అభిప్రాయ పడినట్లు స్పష్టమైంది. జి7 కూటమిలో అమెరికా, బ్రిటన్, కెనడా,ఫ్రాన్స్, జర్మనీ,ఇటలీ, జపాన్ ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన అఫ్గాన్ పరిస్థితులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ సైతం భేటీ కానుంది. ఈ సమావేశానికి హాజరవుతామని 89 దేశాలు తెలిపాయి. భారత్ దేశం కూడా హాజరు కానుంది.