వెల్లింగ్టన్ : కోవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు తీసుకొని వైరస్ను అదుపులోకి తెచ్చిన న్యూజిలాండ్ను డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ఆ దేశంలో ఆరు నెలల తర్వాత తొలి కోవిడ్ మరణం సంభవించింది. ఆక్లాండ్కు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు వైరస్బారినపడి శనివారం మృతి చెందారు. పాజిటివ్గా నిర్థారణ అయిన తర్వాత ఆమెకు వెంటిలేటర్పై చికిత్సనందించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఫిబ్రవరి 16 తర్వాత న్యూజిలాండ్లో కరోనా తొలి మరణం ఇదే. దీంతో ఇప్పటివరకు న్యూజిలాండ్లో వైరస్తో మృతి చెందిన వారి సంఖ్య 27కి చేరింది. న్యూజిలాండ్లో 1.7 మిలియన్ల జనాభాతో ఆక్లాండ్ అతిపెద్ద నగరంగా పేరుగాంచింది. ఆక్లాండ్కు చెందిన వృద్ధురాలికి కుటుంబసభ్యుల ద్వారానే వైరస్ సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతికి పధాని జెండా ఆర్డెర్న్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరూ నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గత నెల 17న ఆక్లాండ్లో తొలి కేసు నమోదవ్వడంతో దేశవ్యాప్తంగా మూడురోజులపాటు లాక్డౌన్ విధించారు. అయినప్పటికీ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 20 మంది వైరస్ బారిన పడ్డారు.