వియన్నా: యురోపియన్ దేశం ఆస్ట్రియాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ అమలు చేయనుంది. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలులోకి రానుంది. ప్రస్తుతం టీకా వేసుకోని వారికి లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కనీసం పది రోజులైనా సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని ఆస్ట్రియా ఛాన్సలర్ అలెగ్జాండర్ షల్కన్బర్గ్ తెలిపారు. కరోనా పాజిటివ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని, మరో వైపు వ్యాక్సినేషన్ తక్కువ స్థాయిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆస్ట్రియా తరహాలోనే ఇతర యురోపియన్ దేశాలు కూడా లాక్డౌన్ అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకోని వారి కోసం స్లోవేకియా ప్రధాని ఇడార్డ్ హేగర్ కూడా సోమవారం నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. టీకాలు తీసుకోని వారు ఉన్న ప్రదేశాల్లో ఆంక్షలను అమలు చేసేందుకు జర్మనీ కూడా సిద్ధమైంది.