ఐదో వారం కొనసాగిన ర్యాలీలు – పాల్గొన్న పదివేల మందికిపైగా
టెల్ అవీవ్: ఇజ్రాయిల్లో వరుసగా ఐదో వారం నిరసనలు కొనసాగాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వ న్యాయ సంస్కరణల ప్రణాళికలను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని టెల్ అవివ్ వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. ప్రధాని నెతన్యాహ్యూ తెచ్చే న్యాయ సంస్కరణలు ఆమోదయోగ్యం కాదని నినాదాలు చేశారు. ఇజ్రాయిల్ జెండాలు చేతపట్టి వర్షాన్ని సైతం లెక్కచేయకుంగా కదం తొక్కారు. ‘కొత్త ప్రభుత్వం ప్రపంచ శాంతికి ప్రమాదకరం’, ‘నెతన్యాహు నుంచి ఇజ్రాయిల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అన్న బ్యానర్లు ప్రదర్శించారు. నెతన్యాహు నేతృత్వంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనప్పటి నుంచి దేశంలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో నిరసనలు మిన్నంటాయని, టెల్ అవీవ్ ఒక్కచోటే ర్యాలీలో పది వేల మందికిపైగా నిరసనకారులు పాల్గొన్నారని స్థానిక మీడియా పేర్కొనగా ఈ సంఖ్యను ఇజ్రాయిలీ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.