లాహోర్: పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పిటిషన్పై తీర్పును లాహోర్ హైకోర్టు మంగళవారం రిజర్వులో పెట్టింది. మే 9వ తేదీన నమోదైన కేసుల్లో అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై విడుదలైన మరుసటి రోజు ఇమ్రాన్ (70) లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో ఇమ్రాన్ ఖాన్ గైర్హాజరీని కోర్టు ప్రశ్నించగా ఆయన ఉదయం 11 గంటలకు వస్తారని న్యాయవాది చెప్పారు. మరోవైపు ఇమ్రాన్ బెయిల్ పిటిషన్ను పంజాబ్ ప్రభుత్వం తరపున న్యాయవాది తోసిపుచ్చారు. ‘కోర్టుకు రాకుండా రక్షణ బెయిల్ (ప్రొటెక్టీవ్ బెయిల్)ను ఇమ్రాన్ ఖాన్ కోరుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి ఇమ్రాన్ తరపు న్యాయవాది స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ కోరుతున్నది అరెస్టుకు ముందు రక్షణార్థక బెయిల్ (ప్రీ అరెస్ట్ బెయిల్) అని రక్షణ బెయిల్ (ప్రొటెక్టీవ్ బెయిల్) కాదని అన్నారు. ఈ కేసును విస్కృత ధర్మాసనానికి పంపాలని ఆయన కోరారు. ‘నేను రాజకీయ బాధితుడను. నాపై పోలీసులు అనేక కేసులు పెట్టారు కాబట్టి అరెస్టు భయమున్నది’ అని పిటిషన్ పేర్కొంది. తన పిటిషన్లో పంజాబ్ ఐజీ, అడ్వకేట్ జనరల్ను ప్రతివాదులుగా ఇమ్రాన్ కాన్ పేర్కొన్నారు. మరోవైపు ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు రెండు కేసుల్లో జూన్ 8 వరకు బెయిల్ను పొడిగించింది. మే 9 నుంచి నమోదైన కేసుల్లో అరెస్టు చేయొద్దని, మే 15న లాహోర్ హైకోర్టును ఆశ్రయించాలని ఇస్లామాబాద్ హైకోర్టు సూచించింది. ఇదే క్రమంలో లాహోర్ హైకోర్టుకు ఇమ్రాన్ వెళ్లగా ఆయన కేసులో తీర్పును రిజర్వు పెట్టినట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడిరచింది.
పాక్ సీజేఐకి వ్యతిరేకంగా
జాతీయ అసెంబ్లీలో తీర్మానం
పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అటా బండియాల్కు వ్యతిరేకంగా ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఓ తీర్మానం చేసింది. జస్టిస్ బండియాల్ ప్రవర్తనపై విచారణ కమిటీ ఏర్పాటుకు జాతీయ అసెంబ్లీ తీర్మానించింది. కాగా, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ఎన్నికలకు ప్రభుత్వం అంగీకరించనప్పటికీ జస్టిస్ బండియాల్ ధర్మాసనం మొండిగా వ్యవహరిస్తోందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. జస్టిస్ బండియల్ ఏకపక్షంగా వ్యవహరించారని, రాజకీయ గందరగోళాన్ని పరిష్కరించడానికి విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ అంశంపై షెహబాజ్ ప్రభుత్వానికి సైన్యం మద్దతిస్తోంది. రెండు ప్రావిన్సులలో ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులకు ఇటీవల తెలిపారు.