ఐరాస: ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే ముసాయిదాకు సంబంధించి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి భారత్ సహకారం అందించలేదు. ఈ మేరకు ఉక్రెయిన్ చేసిన విజ్ఞప్తికి భారత్ నుంచి సానుకూలత లభించలేదు. 193 సభ్యులున్న జనరల్ అసెంబ్లీలో ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక ముసాయిదాపై జరిగిన ఓటింగ్కు భారత్ సహా 32 దేశాలు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో యుద్ధానికి ఏడాది కావస్తున్న క్రమంలో మాస్కో, కీవ్ రెండిరటికి ఆమోదయగ్యమైన ఆచరణసాధ్య పరిష్కారం ప్రపంచంలో ఎవరి వద్దనైనా ఉన్నదా అని భారత్ ప్రశ్నించింది. ఉక్రెయిన్కు అనుకూలంగా 141 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఏడు ఓట్లు వచ్చాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించడం, శాంతిని నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఫ్రాన్స్ ప్రయత్నించినప్పటికీ భారత్ మొదటి నుంచి స్వతంత్ర వైఖరినే ప్రదర్శిస్తోంది. యూఎన్ ఛార్టర్లోని సూత్రాలకు అనుగుణంగా శాశ్వత శాంతి స్థాపన కోసం శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ సిద్ధం చేసింది. ఆ దేశంపై రష్యా దాడి ప్రారంభించి ఏడాది గడిచిన నేపథ్యంలో దానిని జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. క్షేత్రస్థాయిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోరాటం కొనసాగుతున్న తీరును వెల్లడిస్తూ తమ తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా భారత్ను ఉక్రెయిన్ కోరింది. తమది శాంతి పక్షమే అని చెప్పే భారత్.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రష్యా దాడి ఖండన తీర్మానాలకు దూరంగా ఉంటోంది. అలాగే యూఎన్ ఛార్టర్, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సి ఉందని స్పష్టం చేస్తోంది.