టర్కీ ప్రజలకు టీకేపీ పిలుపు
నేడే అధ్యక్ష మలిదశ ఎన్నికలు
అంకారా: టర్కీ అధ్యక్ష ఎన్నికల మలిదశ పోలింగ్ ఈనెల 28వ తేదీ(ఆదివారం) జరగబోతోంది. ఇందుకు ఆ దేశంలో ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. ఇదే క్రమంలో నిరంకుశత్వానికి మారుపేరైన రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్కు ఓటు ద్వారా ‘నో’ చెప్పాలని ప్రజలకు టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) పిలుపునిచ్చింది. అధ్యక్షుడు ఎర్దోగన్కు ఆయన ప్రత్యర్థి కెమెల్ కలిచ్దారోగ్లుకు మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది. వాస్తవానికి వీరి మధ్య టర్కీ గుత్తాధిపతుల ఎవరు ఎక్కువగా ఊడిగం చేయగలరన్న పోటీ ఉన్నది. దేశ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను ఇద్దరూ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనెల 14న జరిగిన మొదటిదశ పోలింగ్లో ఎర్దోగన్కు 49.5శాతం ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థికి 44.9శాతం ఓట్లు పోలయ్యాయి. దేశంలో నిరంకుశ పరిపాలన, పెట్టుబడిదారీ వర్గానికి పెద్దపీట, ప్రజా ప్రయోజనలను తుంగలోకి తొక్కడం వంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఎర్దోగన్ను తిరస్కరించాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. 20 ఏళ్ల నిరంకుశ పాలనలో టర్కీ మహిళలు, యువత, కార్మికులు, దేశభక్తులు పడిన కష్టాలు అన్నిఇన్నీ కావని గుర్తుచేసింది. మంచి రోజులు వస్తాయన్న ఆశలు, ఆకాంక్షలను వృథా చేయొద్దని, ఎర్దోగన్ను బ్యాలెట్ బాక్స్లో సమాధి చేయాలని టర్కీ ప్రజలకు టీకేపీ పిలుపునిచ్చింది. ఫలితాలు ఎలాగున్నాగానీ 28న ఎర్దోగన్కు వ్యతిరేకంగా పడే ప్రతి ఓటు ఏకేపీని దెబ్బతీస్తుందని పేర్కొంది. ‘ఎన్నికల్లో పాల్గొద్దాం. ఎర్దోగన్ను తరిమేద్దాం. నల్లచరిత్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి లెక్క తేలుద్దాం. ఇది కొత్త ఆరంభం. పోరాటాన్ని ఆపొద్దు’ అని టర్కీ ప్రజలకు టీకేపీ పిలుపునిచ్చింది.