. ఇమ్రాన్ ఖాన్కు ఆదేశం
. రక్షణ కోసం లాహోర్ హైకోర్టు పీటీఐ చీఫ్
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారంలోగా లొంగిపోవాలని ఇస్లామాబాద్ జిల్లా,సెషన్స్ కోర్టు ఆదేశాలు జారిచేసింది. తోషాఖానా కేసులో జారీ అయిన నాన్`బెయిలబుల్ అరెస్టు వారెంట్లు రద్దు చేయాలని కోరుతూ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ పెట్టుకున్న ఫిర్యాదును కొట్టివేసింది. ‘ఈ వ్యవహారం రెప్పపాటులో పరిష్కారమవుతుంది. ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? ఆయన కోర్టుకు ఎందుకు రారు? గైర్హాజరికి కారణం ఏమిటి? అని ప్రశ్నించిన న్యాయస్థానం… ఇమ్రాన్ ఖాన్ చట్టప్రకారం పోలీసులకు సహకరించాలేగానీ ప్రతిఘటించరాదని పేర్కొంది. గతంలో కోర్టుకు హాజరైన దాఖలాలు లేవని, నాలుగు సందర్భాల్లో ఆయనకు కోర్టుకు రాకుండా మినహాయింపు లభించిందని న్యాయమూర్తి అన్నారు. దేశ ఔన్నత్యాన్ని సవాల్ చేసేలా ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ఉందని, ధిక్కార వైఖరి వల్ల కొన్ని సాధారణ హక్కులను ఆయన కోల్పోయారని, వెంటనే కోర్టుకు హాజరుకావాలని, శనివారంలోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ లాహోర్ హైకోర్టును శుక్రవారం ఆశ్రయించారు. తనపై ఉన్న తొమ్మిది కేసుల్లో రక్షణ కల్పించాలని విన్నవించుకున్నారు. ఇమ్రాన్ అరెస్టును అడ్డుకునేందుకు ఆయన మద్దతుదారులు భారీసంఖ్యలో మాజీ ప్రధాని నివాసం వద్ద ఉండగా ఇంకొందరు హైకోర్టు వరకూ తోటు వెళ్లినట్లు సమాచారం.