పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కువగా జనం ఆహారం, పానీయాల మీదే ఆధారపడుతున్నారు. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. దీంతో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఇటీవల జనం గోధుమ పిండి కొంటుండగా పెద్ద తొక్కిసలాట జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. పాక్లో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 24.5 శాతం దాటింది. ద్రవ్యోల్బణం అంతలా పెరిగిపోవడంతో ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతోంది. ప్రజలు నిస్సహాయులుగా మారారు. గోధుమల స్టాక్ కూడా ఆ దేశంలో నిండుకుంటోంది. ఖైబర్ పంఖ్తుఖ్వా, సింధ్, బలోచిస్థాన్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి నిధులు రాకపోతే పాకిస్థాన్లో పరిస్థితులు దారుణంగా తయారవుతాయని హెచ్చరించారు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోతోంది ఆ దేశం. చైనా నుంచి తీసుకున్న అప్పులే పాక్ను ముంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడి నుంచి నిధులు కూడా ఆగిపోయాయి. విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటిపోయాయి.
ఏది కొనాలన్నా కష్టమే..
పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం దెబ్బకు ఏది కొనాలన్నా కష్టంగానే మారింది. పానీయాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. తినేందుకు ఏమైనా దొరుకుతాయేమోనని రోడ్లపై ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. గోధుమల ధర రూ. 5 వేలు దాటింది. సగం జనాభా రెండు పూటలా రొట్టెలు పొందలేకపోతున్నారు. దీంతో పరిస్థితులు ముందు ముందు ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు.గోధుమ పిండి ధర కిలోకు రూ.200 దాటింది. పాకిస్థాన్ రూపాయల ప్రకారం.. డజన్ కోడిగుడ్లు రూ. 330 గా ఉంది. కిలో చికెన్ రూ.650కి విక్రయిస్తున్నారు. లీటర్ పాల రేటు రూ.190గా ఉంది. నెయ్యి కిలోకు రూ.540కి అమ్ముతున్నారు. నూనె రూ.580 పలుకుతోంది. ఉల్లిగడ్డలు కిలో రూ. 280కి చేరింది. ఇలా ఏది కొనాలన్నా కష్టంగానే ఉంది.
రోటీలు ఇవ్వండి లేదా చంపండి..
పాకిస్థాన్లో సగం జనాభా ఆకలితో అలమటిస్తోంది. గోధుమ పిండి కిలోకు రూ.150 నుంచి రూ.200 గా ఉంది. సోమవారం.. సింధ్ ప్రావిన్స్లో తక్కువ ధరకే ప్రభుత్వం పిండి విక్రయిస్తోందని వార్తలొచ్చాయి. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి నలుగురు చనిపోయారు. 20 కేజీల గోధుమ పిండి.. రూ. 2800గా ఉంది. దీంతో తిండి కోసం పాకిస్థాన్ ప్రజలు ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు.ఈ పరిస్థితుల్లో డబ్బులు ఆదా చేసేందుకు పాక్ సర్కార్ వింత పద్ధతులను అవలంబిస్తోంది. ఇది చర్చనీయాంశంగా మారింది. రాత్రి 8 గంటలకే మార్కెట్లు మూసేయాలని ఆదేశించింది. షాపింగ్ మాల్స్ కూడా రాత్రి 8 తర్వాత నడవొద్దని పేర్కొంది. ఇలా లైట్స్ ఆఫ్ చేస్తే.. 30 శాతం ఎలక్ట్రిసిటీ ఆదా అవుతుందంట. దీంతో రూ.6200 కోట్ల భారం తప్పినట్లేనని పాక్ భావిస్తోంది.
అల్ అరేబియా పోస్ట్ ప్రకారం.. పాకిస్థాన్లో జనం ఆర్థిక మాంద్యం పరిస్థితులను అధిగమించేందుకు సాహసాలు చేస్తున్నారు. ప్రమాదకరంగా గ్యాస్ సిలిండర్లలో నింపుకోవాల్సిన గ్యాస్ను పెద్ద పెద్ద బెలూన్లు, ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపుకుంటుండటం గమనార్హం. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 10 వేలకు చేరింది. దీంతో ఈ పరిస్థితి నెలకొంది.
పాకిస్థాన్ ఇంత పేద దేశంగా మారేందుకు కారణం ఆ దేశమేనట. అక్కడి ప్రభుత్వ నిర్ణయాలే.. ఇప్పటి సంక్షోభ పరిస్థితుల్ని సృష్టించింది. అభివృద్ధి కోసం కాకుండా.. ఎక్కువగా మిలిటరీ కోసమే ఖర్చు పెడుతోంది అక్కడి ప్రభుత్వం. చైనాతో స్నేహం మరో దెబ్బ తీసింది. చైనా నుంచి తీసుకున్న అప్పులే ఇప్పుడు ఆ దేశాన్ని ముంచాయి. నివేదికల ప్రకారం.. పాక్ అభివృద్ధి కోసం రూ.4300 కోట్లు ఖర్చు చేస్తే.. ఆర్మీపై రూ.18 వేల కోట్లు వెచ్చించింది. పాకిస్థాన్లో సంక్షోభం కారణంగా విదేశీ మారక నిల్వలు కూడా నిండుకున్నాయి. అక్కడి కరెన్సీ నిల్వలు 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. చైనా నుంచి వచ్చే నిధులు కూడా తగ్గిపోయాయి. దీంతో పాక్ ప్రస్తుతం అల్లాడుతోంది. ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి అక్కడ ఉంది. సరైన సమయంలో జీతాలు పొందలేకపోతున్నారు. ఇంకా.. రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్ కూడా అందట్లేదు.