చర్చలు, సంప్రదింపులతోనే ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం: జిన్పింగ్
బీజింగ్: చర్చలు, సంప్రదింపులతోనే ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం సాధ్యమని, ఇందుకు అదొక్కటే మార్గమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నొక్కిచెప్పారు. అణు యుద్ధంలో ఎవరికీ విజయం లభించదని అన్నారు. అంతర్జాతీయంగా తీవ్ర పరిస్థితులకు ఉక్రెయిన్ సంక్షోభం దారితీస్తోందని అన్నారు. చైనా ఎప్పుడూ శాంతి పక్షాన్నే నిలుస్తుందని, శాంతి చర్చలకు కట్టుబడుతుందని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి రాజకీయ పరిష్కారంపై తమ వైఖరిని ఇప్పటికే స్పష్టంచేసినట్లు తెలిపారు. బాధ్యతగల పెద్దదేశంగా, ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యదేశంగా చైనా చేతిపై చేయి వేసుకొని కూర్చోదని, స్వలాభం కోసం ఈ పరిస్థితిని వాడుకోబోదన్నారు. చైనా ఏమి చేసినా అది బోర్డుకు అతీతంగానే ఉంటుందని అన్నారు. అణ్వాస్త్రాలపై సంబంధిత పార్టీలన్నీ సమన్వయం పాటించాలని, మానవాళి భవిష్యత్ దృష్ట్యా చర్యలు తీసుకోవాలని, కలిసి సంక్షోభాన్ని పరిష్కరించాలని జిన్పింగ్ సూచించారు. శాంతి సుస్థిరతకు చైనా కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడుతూ జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా-ఉక్రెయిన్ సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభంపై అభిప్రాయాలు పంచుకున్నారు. యురేసియన్ వ్యవహారాలపై చైనా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని ఉక్రెయిన్లో, ఇతర దేశాల్లో పర్యటించడానికి పంపనున్నట్లు జిన్పింగ్ చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి రాజకీయ పరిష్కారంపై అన్ని పక్షాలతో కూలంకుషంగా చర్చలు జరిపేందుకే ప్రతినిధిని పంపుతున్నట్లు చెప్పారు. 31ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయన్నారు. చైనాతో సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధిపై జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలను జిన్పింగ్ ప్రశంసించారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై పరస్పర గౌరవం అనేది ద్వైపాక్షిక సంబంధాలకు రాజకీయ పునాది వంటిదని అన్నారు. భవిష్యత్పై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఉక్రెయిన్తో సంబంధాలను అభివృద్ధి చేసుకోడానికి చైనా సుముఖంగా ఉన్నదని చెప్పారు.
వియత్నాంచైనా వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15ఏళ్లు చైనా, వియత్నాం మధ్య సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యానికి ఈ ఏడాదితో 15ఏళ్లు పూర్తి అవుతాయని జిన్పింగ్ చెప్పారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ (సీపీవీ) కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు ట్రోంగ్ థి మైతో బీజింగ్లో జిన్పింగ్ భేటీ అయ్యారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి న్యూగెన్ ఫుట్రోంగ్తో దగ్గర సంబంధాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాజకీయ, వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్ట పర్చుకోవాలన్నారు. సోషలిజం పురోగతికి రెండు దేశాలు కలిసి పనిచేయాలని జిన్పింగ్ సూచించారు. శాంతి
పురోగతికి చైనా, వియత్నాం తోడ్పాటును కొనియాడారు. తమ ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అభివృద్ధి వ్యూహాలు, ప్రాజెక్టులు, ఆధునిక మౌలికవసతుల కనెక్టివిటీ, సంప్రదాయ మైత్రిని పెంచుకోవాలని సూచించారు.