ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్!
కాబూల్: అఫ్గాన్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ శనివారం ఏర్పడనున్నదని తాలిబన్ ప్రతినిధి తెలిపారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నూతన ప్రభుత్వ నాయకత్వ పగ్గాలు చేపట్టనున్నారని ఇస్లామిస్ట్ గ్రూపు వర్గాలు శుక్రవారం వెల్లడిరచాయి. ప్రభుత్వఏర్పాట్లకు తుదా దశలో ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడైన ముల్లా మొహమ్మద్ యాకూబ్, షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ తో కలిసి ముల్లా బరాదర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వీరు ప్రభుత్వంలో ఉన్నత పదవులు చేపట్టనున్నారు. చట్టాలపై సమగ్ర అవగాహన, షరియా చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిఉండటం ముల్లా బరాదర్కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి కారణమైంది. 1996 నుంచి 2001 మధ్య కాలంలో అఫ్గాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సమయంలో తాలిబన్లు షరియా చట్టాన్ని అమలు చేశారు. ఈ చట్టం మత ఛాందసవాదానికి ప్రతీకగా భావిస్తారు. షరియా చట్టంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందని తాలిబన్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రజల భద్రత, సామాజికాంశాలు లక్ష్యంగా కాందహార్ వేదికగా మూడు రోజులపాటు చర్చలు జరుగనున్నాయని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తమ దేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్గా పేరు మార్చనున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి బరాదర్ సహా కీలక నాయకులు ఈ భేటీకి హాజరుకానున్నారు. షరియా చట్టంపై ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. తాలిబన్ అత్యున్నత మత నాయకుడు హైబతుల్లా అఖుంజాదా మతపరమైన విషయాలు పాలనపై దృష్టి సారిస్తారు. 12 మంది ముస్లిం పండితుల సంప్రదింపులతో షురాతో 25 మంత్రిత్వశాఖలు తాత్కాలిక ప్రభుత్వంలోఏర్పాటుచేశారు. ఆరు నుంచి ఎనిమిదినెలల్లో ప్రణాళికా బద్దంగా పెద్దలు, ప్రతినిధులతో రాజ్యాంగ, భవిష్యత్ నిర్మాణం జరుగనుంది.
బరాదర్ జీవిత విశేషాలు
ముల్లా అబ్దుల్ఘనీ బరాదర్ తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరు. అఫ్గానిస్తాన్లోని ఉర్జాన్ ప్రావిన్స్లోని వీట్మాక్లో 1968లో బరాదర్ పష్తూన్ తెగలో జన్మించారు. కాందహార్లో పెరిగారు. ఒంటికన్ను ముల్లా ఒమర్తో కలిసి సోవియట్ సేనలపై పోరాటం చేశారు. 1996నుంచి 2001 వరకు తాలిబన్ పాలనలో హెరత్, నిమ్రూజ్ ప్రావిన్స్లకు గవర్నర్గా , పశ్చి ఆఫ్గాన్ కోర్ కమాండర్గా వ్యవహరించారు.తాలిబన్ ఆర్మీకి డిప్యూటీగా పనిచేవారు. కాబూల్ సెంట్రల్ ఆర్మీ కోర్ కమాండర్గా కూడా బరాదర్ పనిచేశారు. తాలిబన్కోసం కోడ్ ఆఫ్ కండక్ట్ను పుస్తకరూపంలో బరాదర్ రాశారు. అమెరికా దాడుల సమయంలో 2001లో మిత్రుడు ముల్లా ఒమర్తో కలిసి పలాయనం చేపట్టిన బరాదర్ 2010లో కరాచీలో అమెరికాకు చెందిన సీఐఏ సిబ్బంది అదుపులోకి తీసుకుంది.2018లో పాక్ బరాదర్ను విడుదల చేసింది. తర్వాత ఆయన్ను ఖతార్కు తరలించి తాలిబన్ రాజకీయ కార్యకలాపాల బాధ్యత అప్పగించారు.
యూఏఈ అఫ్గాన్కు చేయూత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అఫ్గాన్కు అత్యవసర వైద్య, ఆహార సాయాన్ని అందించింది. ఈ విషయాన్ని యుఏఈ విదేశాంగ మంత్రిత్వశాఖ థృవీకరించింది. అఫ్గాన్లో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపధ్యంలో మొదటిసారి యూఏఈ సహాయాన్ని అందించింది.