ప్రిటోరియా: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్యుత్ కోతలను నిరసిస్తూ దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘాల పిలుపు మేరకు దక్షిణాఫ్రికా నగరం ప్రిటోరియాలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్త సమ్మె సందర్భంగా నిరసనకారులు ప్లకార్డులు చేపట్టి నినదించారు. పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న జీవన వ్యయాన్ని నియంత్రించాలని దక్షిణాఫ్రికా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రధాన కార్యదర్శి జ్వెలిన్జిమా వావి అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రభుత్వాన్ని కోరారు. కనీసం 14 మిలియన్ల మంది ప్రజలు ఒక ప్లేట్ ఆహారాన్ని కూడా కొనుగోలు చేయలేని దీన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనావైరస్ ప్రభావంతో 2 మిలియన్ల ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. నిరుద్యోగిత రేటు 35శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం 7.8శాతానికి తాకింది. ఆహారం, ఆల్కహాల్ లేని పానీయాల ధరలు 9.7శాతం పెరిగాయి. విద్యుత్ ఛార్జీలు 7.5శాతం పెరిగాయి, వేతనాలు పెంచాలని, ప్రజాసేవల్లో పెట్టుబడులు పెట్టాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.