ఖాట్మండు : నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబాను రెండు రోజుల్లోపు ప్రధానిగా నియమించాలని నేపాల్ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫారసు మేరకు మే 22న నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి దిగువసభను రద్దు చేశారు. ఐదునెలల వ్యవధిలో రెండవసారి రద్దయిన ప్రతినిధుల సభను నేపాల్ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. చీఫ్ జస్టిస్ చోలేంద్ర షుమ్మర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గతవారం వాదనలను ముగించింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫారసు మేరకు మే 22న విద్యాదేవి భండారి దిగువసభను రద్దు చేసి నవంబరు 12, 19వ తేదీల్లో ఎన్నికలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యంతర ఎన్నికల కోసం గతవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. దిగువసభ రద్దును సవాలుచేస్తూ ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్తో పాటు మొత్తం సుప్రీంకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగ ధర్మాసనం జులై 5న రిట్ పిటిషన్లపై విచారణను ముగించి దిగువ సభను పునరుద్ధరించడంతోపాటు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ చీఫ్ను ప్రధానిని చేయాలని ఆదేశించింది.