వాషింగ్టన్: విద్యార్థులు, పర్యాటకులతో పాటు అనేక విభాగాలకు సంబంధించిన వీసాల కోసం రుసుమును భారీగా పెంచేస్తూ అమెరికా ప్రకటన చేసింది. మే 30వ తేదీ నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతోంది. వీసాల రుసుము బిజినెస్/ టూరిజం కోసం ఇచ్చే విజిటర్ వీసా (బీ1/బీ2), స్టూడెంట్, ఎక్స్ఛ్ంజ్ విజిటర్ వీసాల ఫీజును 160 డాలర్ల నుంచి 185డాలర్లకు పెంచింది. తాత్కాలిక వర్కింగ్ వీసాలైన హెచ్, ఎల్, ఓ, పీ, క్యూ, ఆర్ విభాగాలకు సంబంధించి ఫీజు 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు చేరింది. ట్రీటీ ‘ఈ’ కేటగిరీలోని ట్రేడర్, ట్రీటీ విజిటర్, ట్రీటీ అప్లికెంట్స్ ఫీజు 205 డాలర్ల నుంచి 315 డాలర్లకు పెరిగింది. ఇతర కాన్సులర్ ఫీజుల్లో మార్పులేదని అధికారిక ప్రకటన పేర్కొంది. వీసా జారీ చేసే సమయాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకన్న అమెరికా హెచ్1బీ వీసాల స్టాంపింగ్ దేశం బయట కూడా చేసే విధంగా పైలెట్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. ఇది త్వరలోనే ఆచరణలోకి రాబోతోంది. ప్రస్తుతం వర్కింగ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు 60-280 రోజుల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. ప్రయాణ వీసా కోసం ఏడాదిన్నర సమయం పడుతోంది. గతేడాది 1,25,000 మంది భారతీయులకు విద్యార్థి వీసాలను జారీ చేసి అమెరికా రాయబార కార్యాలయం రికార్డు సృష్టించడం విదితమే.