ఐరాస: ప్రకృతికి అనుగుణంగా జీవించడానికి మానవాళి సరికొత్త మార్గాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమైందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు. ‘‘మూమెంట్ ఫర్ నేచర్’’ అనే శీర్షికతో జనరల్ అసెంబ్లీ చేపట్టిన చర్చలకు సంబంధించిన వీడియో సందేశంలో ఐరాస చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ప్రయోజనాలు క్షీణించడంతో వాతావరణంలో అంతరాయం, జీవవైవిధ్య నష్టంతో కాలుష్యం మూడురెట్లు పెరిగిందని గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీవ వైవిధ్య కాలుష్యంతో మిలియన్ జాతుల మొక్కలు, జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లక్షలాది మంది జీవనోపాధికి ముప్పు వాటిల్లుతోందన్నారు. భూమిలో మూడు వంతులు, సముద్రంలో మూడిరట రెండు వంతులు మానవ కార్యకలాపాల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. దాదాపు 3.2 బిలియన్ల మంది ప్రజలు పర్యావరణం క్షీణతతో బాధపడుతున్నారని గుటెర్రస్ చెప్పారు. ‘‘మానవ కార్యకలాపాలు గ్రహాల గమనానికి మూలం కాబట్టి, పరిష్కారాలు కీలకమని పేర్కొన్పారు. ప్రకృతితో మనిషి సమన్వయం చేసుకోవడం ద్వారా నూతన మార్గాన్ని అమలు చేయవలసిన సమయం వచ్చిందన్నారు. ఈ ఏడాది చివర్లో ఈజిప్ట్టు, కెనడాలో జరగనున్న కాప్27 వాతావరణ సదస్సు, కాప్15 జీవవైవిధ్య సదస్సు రెండవ దశను ప్రస్తావిస్తూ, ‘ఉద్గారాలను తగ్గించడం, జీవవైవిధ్య నష్టానికి ప్రధాన చోదకాలను పరిష్కరించడం, ఆర్థిక అంతరాన్ని పూడ్చడం వంటి లక్ష్యాలతో ఈ సదస్సులలో నిబద్ధతలను ధైర్యంగా, ప్రపంచ వ్యాప్తంగా ఏకాభిప్రాయంతో అమలు చేయాలని గుటెర్రస్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.